ఏపీ బీజేపీ ఎంపీలకు అమిత్ షా క్లాస్ : అమరావతి రగడ పైనే..: మై దేఖూంగా..!
ఏపీ బీజేపీ ఎంపీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. అమరావతి వ్యవహారం పైన తలో రకంగా మాట్లాడటం..పరోక్షంగా విమర్శలు చేసుకోవటంతో ఈ మొత్తం వ్యవహారం షా వద్దకు చేరింది. రెండు రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అమరావతి పైన చేసిన వ్యాఖ్యలు..వాటికి భిన్నంగా జీవీఎల్ స్పందించిన తీరు ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, దీని పైన టీడీపీ నుండి బీజేపీ చేరిన రాజ్యసభ సభ్యులు అమిత్ షా ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో త్వరలో పదవీ విరమణ చేస్తున్న గరికపాటికి రాజ్యసభ సీటు ఇస్తామన్న హామీని మిగతా ఎంపీలు ఆయనకు గుర్తుచేశారు. అయితే, ఇంకా దీని పైన ఆలోచన చేస్తున్నామని షా చెప్పినట్లు సమాచారం. అమిత్ షా జోక్యంతో ఇప్పుడు ఏపీ బీజేపీ ఎంపీల మధ్య సాగుతున్న మాటల యుద్దం కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
కలిసి కట్టుగా ఉండాల్సిందే..
అమరావతి నుండి రాజధాని తరలింపు వ్యవహారం ఏపీ బీజేపీ ఎంపీల పరస్పర విరుద్ద ప్రకటనల పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఏపీ బీజేపీ ఎంపీలు రాజధాని తరలింపు వ్యవహారం పైన భిన్నంగా స్పందిస్తున్నారు. కేంద్రం చూస్తూ ఊరుకోదని..అడ్డుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. అదే సమయంలో మరో ఎంపీ జీవీఎల్ నరసింహా రావు మాత్రం దీనితో విభేదించారు. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని..తాను కేంద్ర పెద్దలతో మాట్లాడిన తరువాతనే స్పందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారం పైన అమిత్ షా వద్దకు పంచాయితీ చేరింది. పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. ఏపీలో సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు..వివాదం పైన ఆయన నేరుగా వాకబు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు అమిత్ షాతో భేటీ అయ్యారు.
జీవీఎల్ పైన ఫిర్యాదు.. రాజ్యసభ సీటు పైనా..
టీడీపీ నుండి బీజేపీలో చేరిన సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్. గరికపాటి మోహనరావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఏపీ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలను షా దృష్టికి తీసుకెళ్లడమే గాక.. ఈ విషయంలో తాము చెబుతున్న దానికి భిన్నంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రద్ధగా విన్న అమిత్ షా.. మీరంతా కలిసికట్టుగా మాట్లాడుకోవాలని, పరస్పరం విభేదించనవసరం లేదని చెప్పినట్లు తెలిసింది.
Recommended Video
మై దేఖూంగా అని చెప్పిన అమిత్ షా
ఈ విషయంపై ఎంపీలు ఇంకా చెప్పబోతుండగా మై దేఖూంగా.. (నేను చూస్తాను) అని ఆయన అన్నట్లు సమాచారం. ఈనెల 10, 11 తేదీల్లో మళ్లీ కలుసుకుందామని వారికి చెప్పారు. కాగా త్వరలో పదవీ విరమణ చేస్తున్న గరికపాటికి రాజ్యసభ సీటు ఇస్తామన్న హామీని మిగతా ఎంపీలు ఆయనకు గుర్తుచేశారు. ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలో ఆలోచిస్తున్నాం.. అని షా బదులిచ్చారు. దీంతో..గరికపాటికి రాజ్యసభ సీటు కోసం వారు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తిరిగి 11న ఏపీ వ్యవహారాల పైన అమిత్ షా చర్చించే అవకాశం ఉంది.