పురంధేశ్వరికి అమిత్ షా ఝలక్?: అలాంటి వాళ్లు ఎప్పటికీ వద్దు
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఏపీ పర్యటనలో కొందరు రాష్ట్ర కమలం పార్టీ నేతలు అనుకున్నది ఒకటి కాగా, జరిగింది మరొకటి!
అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఏపీ పర్యటనలో కొందరు రాష్ట్ర కమలం పార్టీ నేతలు అనుకున్నది ఒకటి కాగా, జరిగింది మరొకటి! ఈ పర్యటనలో పొత్తులపై తేలిపోతుందని పలువురు బిజెపి నేతలతో పాటు వైసిపి కూడా భావించింది.
రాజీకి వచ్చిన చంద్రబాబు - అమిత్ షా
తన తెలంగాణ పర్యటనలో అమిత్ షా పొత్తుల అంశంపై మాట్లాడి సస్పెన్స్కు తెరలేపారు. తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ఒంటరిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దీనిని చాలామంది ఏపీకి ఆపాదించారు.
తెలంగాణలో వ్యాఖ్యలపై తేలిపోయింది
కానీ తెలంగాణలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతానికి కేవలం అక్కడికే పరిమితం అని తేలిపోయింది. అయితే టిడిపితో కలిసి ఉంటూనే సొంతగా ఎదగాలని అమిత్ షా కోరుకుంటున్నారు.
పొత్తుపై తేల్చేశారు
ఏపీలో టిడిపి పొత్తుపై తెలంగాణలో సస్పెన్స్ క్రియేట్ చేసిన అమిత్ షా, ఏపీ పర్యటన సమయంలో ఓ విధంగా స్పష్టత ఇచ్చారు. అయితే మొదటి నుంచి భావించినట్లుగా 2019 వరకు మాత్రమే ఈ పొత్తుపై స్పష్టత కనిపిస్తోంది.
బీజేపీ నేతలు అలా భావించినా..
మరోవైపు, పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు సమయం వచ్చినప్పుడల్లా టిడిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పర్యటనలో పొత్తుపై తేలిపోతుందని అలాంటి వారు చాలామంది భావించారని అంటున్నారు.
పురంధేశ్వరి వంటి వారికి షాక్!
కానీ చంద్రబాబు - అమిత్ షా భేటీలో పొత్తు కొనసాగుతుందని స్పష్టమయింది. ఇది పురంధేశ్వరి, వీర్రాజు, కన్నాల వంటికి ఓ విధంగా షాక్ అంటున్నారు.
విమర్శలపై అమిత్ షా అలా..
మరోవైపు, టిడిపి నేతల వ్యాఖ్యలను పలువురు బిజెపి నేతలు అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే, ప్రస్తుతానికి పొత్తు కొనసాగుతుందని, కాబట్టి అచితూచి మాట్లాడాలని నేతలకు ఆయన సూచించినట్లుగా ప్రచారం సాగుతోంది. టిడిపి నేతలు విమర్శలు చేస్తే ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారని అంటున్నారు.
టిడిపిని చూసి రావొద్దనికుంటే.. ఎప్పటికీ వద్దు
ఏపీలో పలువురు నేతలు బిజెపిలో చేరాలనుకుంటున్నారని, కానీ టిడిపితో పొత్తు కారణంగా వారు వెనక్కి వెళ్తున్నారని అమిత్ షాకు పలువురు నేతలు చెప్పారని తెలుస్తోంది. అయితే, ఎవరైనా బిజెపిని చూసి రావాలని, టిడిపితో పొత్తు ఉందని రాకుండా ఉంటే.. అలాంటి వారు ఎప్పటికీ అవసరం లేదని అమిత్ షా సూటిగా చెప్పారని తెలుస్తోంది. పార్టీల సిద్ధంతాలు ఉంటాయని, వాటిని చూసి రావాలని చెప్పారని తెలుస్తోంది. మిత్రపక్షాన్ని చూసి రాకపోవడం ఏమిటని అడిగారని తెలుస్తోంది.