అమ్మ ఒడి: ఏపీలో విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్ సదుపాయం, జగన్ కీలక ప్రకటన, ప్రతిపక్షాలపై ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు. ఎన్నికల హామీ అయిన నవరత్నాల అమలులో భాగంగా నిరుపేద విద్యార్థులందరూ బడి బాట పట్టాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని అందిస్తున్న సీఎం జగన్ ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొచ్చామని చెప్పిన జగన్, అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.
విద్యార్థుల కోసం ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్ సదుపాయం
అమ్మఒడి పథకానికి టెక్నాలజీల అనుసంధానం చేసిన సీఎం జగన్ విద్యార్థులలో కంప్యూటర్ స్కిల్స్ పెంపొందించడం కోసం ల్యాప్ టాప్ ఆఫర్ చేశారు. వచ్చే ఏడాది నుండి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు, అమ్మ ఒడి డబ్బులు వద్దనుకుంటే లాప్ ట్యాప్ ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. ఫోర్ జి బి ర్యామ్, 500జీబి హార్డ్ డిస్క్, విండోస్ 10 ఓ ఎస్ ఫీచర్స్ తో , మూడేళ్ల వారంటీతో లాప్ టాప్ ఇస్తామని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పిస్తామన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని చూసి కడుపు మంట తట్టుకోలేక ఆలయాలపై దాడులు చేస్తున్నారని జగన్ ఫైర్
ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి, రాష్ట్ర అభివృద్ధిని చూసి కడుపు మంట తట్టుకోలేక అధికార పార్టీని టార్గెట్ చేస్తూ దేవాలయాలలో విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని, ఆతర్వాత దేవాలయాల సందర్శన అంటూ హంగామా సృష్టిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. రథాలను తగలబెట్టి రథ యాత్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయని మండిపడిన జగన్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదని వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో స్కూల్స్ పై విధ్వంసం చేస్తారేమో?
ఇప్పటికే విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు, రాబోయే రోజుల్లో స్కూల్స్ పై విధ్వంసం చేస్తారేమో, విద్రోహ శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలంటూ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల దృష్టి మరలకుండా, రాష్ట్రంలో ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. గతంలో విద్యావ్యవస్థ పనితీరులో మార్పు తీసుకురావడం కోసం ఏపీ ప్రభుత్వం నాడు నేడు అమలు చేస్తోందని జగన్ తెలిపారు.
దేవుడిపై భక్తి లేని వాళ్లంతా భక్తి ఉన్నట్టు డ్రామాలాడుతున్నారు
పాదయాత్ర సమయంలో చదివించే ఆర్థిక స్తోమత లేక పిల్లలను కూలి పనులకు పంపించిన పరిస్థితులను చూశానని, ఏ విద్యార్థి చదువుకు దూరంకావద్దు అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని జగన్ చెప్పారు. దేవుడిపై భక్తి లేని వాళ్లంతా భక్తి ఉన్నట్టు డ్రామాలాడుతున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు. కరోనాకు భయపడి చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్లో దాక్కుని సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు.