అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ స్కూళ్లకు కాదు.. వివరణ ఇచ్చిన సీఎం జగన్..కానీ అందులో కూడా మరో మెలిక
అమ్మఒడి పథకంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందా అన్న మీమాంస నెలకొంది. అయితే ఇలాంటి అపోహలకు సీఎం కార్యాలయం స్పష్టత ఇచ్చింది. అమ్మఒడి పథకం తమ పిల్లలను బడికి పంపిన ప్రతిఒక్క తల్లికీ వర్తిస్తుందని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.
Recommended Video
పిల్లలను బడికి పంపే ప్రతితల్లికి అమ్మఒడి వర్తింపు
ఏపీ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైయస్ జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. తమ మేనిఫెస్టోలో ఉన్న నవరత్నాల్లో ఒకటిగా అమ్మఒడి పథకం చేర్చారు. ఈ పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపిన ప్రతి పేద తల్లికీ జనవరి 26వ తేదీన రూ.15వేలు తమ ఖాతాలోకి ప్రభుత్వం డబ్బులు వేస్తుందని తెలిపారు. అయితే దీనిపై మొదట్లో స్పష్టత రాలేదు. ఒక్క ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు మాత్రమే డబ్బులు ఇస్తారా లేక ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఇస్తారా అనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో పథకంపై పలు సందేహాలు అపోహలు తెరమీదకు వచ్చాయి.
ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యలతో విమర్శలు
కొద్ది రోజుల క్రితం ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించే తల్లులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడంతో విమర్శలు వచ్చాయి. నవరత్నాల్లోని తొలిరత్నంనే జగన్ ప్రభుత్వం నీరుగారుస్తోందనే విమర్శలు ఇటు ప్రతిపక్షంతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రభుత్వం దిద్దు బాటు చర్యలకు దిగింది. పేద తల్లి తమ బిడ్డను ఏ స్కూలుకు పంపినా అమ్మఒడి పథకం వర్తిస్తుందంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమ్మఒడి పథకంలో మరో మెలిక ఉందా..?
దేశంలో నిరక్షరాస్యత 23శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో 33శాతంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అమ్మఒడి పథకంలో ఎలాంటి అపోహలు లేవని..బిడ్డను బడికి పంపిన ప్రతి తల్లికి డబ్బులు చేరవేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ బడులను కూడా మెరుగుపరిచేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక అమ్మఒడి పథకం అమలుకు ప్రతి తల్లికీ తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. అయితే పాదయాత్ర సందర్భంగా పిల్లలను స్కూలుకు పంపిన ప్రతితల్లికీ అమ్మఒడి పథకం ద్వారా రూ. 15వేలు డబ్బులు ఇస్తామని నాటి ప్రతిపక్షనేతగా జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. అయితే కేవలం తెల్లరేషన్ కార్డు ఉన్న తల్లికి మాత్రమే పథకం అమలు చేస్తారా లేదా తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ అమలు చేస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.