Amphan cyclone: ఉవ్వెత్తున ఎగుస్తున్న అలల బీభత్సం, ఆ ప్రాంతాల్లో అలర్ట్
అమరావతి: పశ్చిమ-తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంపన్ పెను తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 6 గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా సాగుతోందని పేర్కొంది. ఒడిశాలోని పారాదీప్కు దక్షిణ దిశగా 570 కి.మీ, పశ్చిమబెంగాల్ లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 720 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైనట్లు తెలిపింది.
Recommended Video
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
ఉవ్వెత్తున ఎగుస్తున్న అలలు..
బుధవారం మధ్యాహ్నం వరకు తుఫాను తీరం దాటే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. బుధవారం మధ్యాహ్నం వరకు తీరం దాటనున్న ఆంపన్ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ-ఉప్పాడ తీరంలో ముందే కనిపిస్తోంది. గత రెండ్రోజులుగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో రహదారికి రక్షణగా ఉన్న రాళ్లు ఎగిరి రోడ్డుపై పడుతున్నాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
కాకినాడ పోర్టుకు హెచ్చరికలు.. అలల బీభత్సం
కాకినాడ పోర్టులో రెండో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంతర్వేదిలో సముద్రం 10 అడుగుల ముందుకు వచ్చింది. పలు తీరప్రంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉబ్బార, మాయపట్నం, సూరాడపేట, కోనపపుపేటలో పెద్ద ఎత్తున అలలు తీరంలోని ఇళ్లపై ఎగిసిపడుతున్నాయి. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. నివాసాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు.
ఇళ్లల్లోకి సముద్రపు నీరు.. మత్స్యకారులకు హెచ్చరికలు
కోనప్పపేట్ శోర్లో భారీగా అలలు వస్తుండటంతో మత్సకారులు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పల్లిపేట్, సురదిపేట్, మాయపట్నం గ్రామాల్లోని మత్స్యకారుల ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చి చేరింది. తుఫాను కారణంగా జూన్ 14 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం మత్స్యకారులకు నెలకు రూ. 10వేలు ఇస్తోందని ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు.
శ్రీకాకుళంలోనూ..
ఇక శ్రీకాకుళం జిల్లాలోనూ అంపన్ తుఫాను ప్రభావం శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతాలపైనా ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాలి మండలాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. తుఫాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సహాయం కోసం 08942-240557 నెంబర్ కు ఫోన్ చేయాలని కలెక్టర్ నివాస్ కోరారు.