అమరావతి ల్యాండ్ స్కామ్..చంద్రబాబు, లోకేష్ లకు ఆ దమ్ముందా: మంత్రి అనీల్ సవాల్
రాజధాని అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే . దీనిపై స్పందించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు, నారా లోకేష్ కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశం పైన సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు, రాజధాని అమరావతి భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు సహకరిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు.
అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ దర్యాప్తుకు కేంద్రానికి లేఖ
తాడేపల్లిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్, అమరావతి భూ కుంభకోణంలో ఉన్న టిడిపి నాయకుల పేర్లను వెల్లడించడానికి నిరాకరించారు. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఏపి ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు మంత్రి పేర్కొన్నారు. సిట్, క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికల ఆధారంగా భూ కుంభకోణంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ దర్యాప్తు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబుకు విచారణ ఎదుర్కొనే దమ్ముందా ? ప్రశ్నించిన మంత్రి అనీల్
ఏపీ ప్రభుత్వం అమరావతి భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాసిన లేఖకు తాము సహకరిస్తామని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయగలరా ? అని అడిగారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబుకు అమరావతి భూ కుంభకోణంపై విచారణ ఎదుర్కొనే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిబిఐకి లేఖ రాయాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.
అక్రమాలు జరగకుంటే భయం దేనికి?
రాజధానిలో అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరగలేదని చెప్పే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ అక్రమాలు జరగకుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు అంటూ నిలదీశారు. చంద్రబాబు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉండాలని, ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో కూడా భారీ అవినీతి జరిగిందని అన్నీ త్వరలోనే బయటకు వస్తాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే రాజధాని అమారావతి భూ కుంభకోణం పై విచారణ జరిపించాలని సీఐడీ, ఈడీకి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం .
Recommended Video
అమరావతి ల్యాండ్ స్కాం లో బిగుస్తున్న ఉచ్చు?
ఈ లేఖపై స్పందించిన ఈడీ అమరావతి భూముల కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. అమరావతి భూ కుంభకోణంలో టీడీపీ నేతలకు ఉచ్చు బిగించేలా కేంద్ర సంస్థలను కూడా రంగంలోకి దించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం . ఇది కక్ష సాధింపు చర్యగా టీడీపీ నేతలు విమర్శిస్తుంటే , తప్పు చెయ్యకుంటే భయం దేనికి అని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ మంత్రులు .