కాలేజీ యాజమాన్యం వేధింపులు?: బెంగళూరులో విశాఖ విద్యార్థి ఆత్మహత్య
బెంగళూరు: కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరు బెల్లందూరు సమీపంలోని కేశవనహళ్లిలోని అమృత స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యా సంస్థలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకు చెందినవాడిగా గుర్తించారు.
కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేకే హర్ష అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితులు, కాలేజీ విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. హర్ష ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కాలేజీ యాజమాన్యం అతడ్ని వేధించిందన్నారు.
కాగా, ఈ కళాశాలలో 2000 మందికిపైగా విద్యార్థులు బీటెక్ అభ్యసిస్తున్నారు. ఎంటెక్, ఎంబీఏ కోర్సులను 200మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గత నెలలో కాలేజీకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారనే నెపంతో హర్షను కాలేజీ యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడ్ని కాలేజీ నుంచి రెస్టికేట్ చేసింది.
ఈ నేపథ్యంలో మానసికంగా ఆవేదనకు గురైన హర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్ష కాలేజీ ఆవరణలో ఎలాంటి విద్వంసానికి పాల్పడలేదని కాలేజీ యాజమాన్యానికి పలువురు విద్యార్థులు చెప్పినప్పటికీ.. కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. అతనిపై చర్యలు తీసుకుంది. హర్ష చాలా మంచి వ్యక్తని, అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండేవాడని చెబుతున్నారు తోటి విద్యార్థులు.
హర్షతోపాటు 15మందిని రెస్టికేట్ చేసిన యాజమాన్యం, 45మందిని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో అవమానంగా భావించిన హర్ష.. బలవన్మరణానికి పాల్పడ్డాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే హర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ భారీ ఎత్తున విద్యార్థులు కళాశాలలో నిరసన ప్రదర్శన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కాలేజీ ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. హర్ష ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.