ఔను! ఆ ప్రశాంత కిషోరే:త్వరలో సిఎం చంద్రబాబుకు సలహాలు ఇవ్వొచ్చు...తానే సిఎం కూడా కావొచ్చు
అమరావతి:రాజకీయ వ్యూహకర్తగా పరోక్షంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి...ఆ తరువాత ఇండియాలో కింగ్ మేకర్ గా కంటే కింగ్ గా ఉండటమే బెస్ట్ అనుకొని...ఇటీవలే అనూహ్యంగా రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆ ప్రసిద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోరే మన టాపిక్.
ఇటీవల జేడీయూ తీర్థం పుచ్చుకొని...రావడం రావడంతోనే ఆ పార్టీలో కీలకమైన పదవిని కట్టబెట్టించుకొని...మరోసారి హాట్ టాపిక్ గా మారిన ప్రశాంత్ కిషోర్ భవితవ్యం ఏమిటి?..పీకేని జేడియూ ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్, బీహర్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించడంతో ప్రస్తుతం పికె స్థానం ఆ పార్టీలో నంబర్ 2 అనేది కన్ఫామ్ చేసినట్లే. అయితే వైసిపికి రాజకీయ వ్యూహకర్తగా ఒప్పందం చేసుకొని...మధ్యలోనే ఆ అగ్రిమెంట్ నుంచి తప్పుకొని పికె ఇలా చేయడానికి కారణం ఏంటి?...దీని పర్యవసానాలు ఎలా ఉండొచ్చనే విషయమై రాజకీయ పరిశీలకుల విశ్లేషణ
కింగ్ మేకర్...కింగ్ అవ్వాలని
సీఎం నితీశ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యూహకర్తగా అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రశాంత్ కిషోర్...వైసిపి రాజకీయ సలహాదారుగా ఒప్పందం ఉండగానే...గత నెలలో అనూహ్యంగా తాను రాజకీయ వ్యూహకర్త వృత్తికి గుడ్ బై చెబుతున్నాని, వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరుపున పనిచేయబోవటం లేదని ప్రకటించి వైసిపికే కాదు రాజకీయ శ్రేణులకే గట్టి షాక్ ఇచ్చాడు. అప్పుడే అతడి పొలిటికల్ ఎంట్రీ గురించి చూచాయగా చెప్పగా...కొన్ని రోజులు కూడా గడవకుండానే జెడియూలో ఎంట్రీ ఇచ్చి అందరి డౌట్లు తీర్చేశాడు.
ఆ పార్టీలో...ఇప్పుడు నంబర్ 2
ఇక ఇటీవలే తమ పార్టీలో చేరిన ప్రశాంత్ కిశోర్ను జేడీయూ ఉపాధ్యక్షుడిగా నితీశ్ కుమార్ నియమించారు. నితీశ్ నిర్ణయంతో పార్టీలో నంబర్ 2 గా పీకే అధికారింగానే కొనసాగనున్నాడు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్...తర్వాత ఆ పార్టీకి దూరమైనా ఆయనకు నితీశ్ కుమార్తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉండేవని అందరూ చెప్పుకునేవారు. ఆ తర్వాత కాలంలో పీకే పంజాబ్, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలకు వ్యూహరచన చేశారు. పంజాబ్లో ఆప్ను తోసిరాజని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఉపకరించాయని చెప్పుకోవచ్చు.
నితీష్...సరికొత్త ఒరవడి
ఇక జెడియూలో పీకేకు నంబర్ టూ స్థానం కట్టబెట్టడంపై నితీష్ విశిష్టత గురించి చెప్పుకొనితీరాలి. కడుపున బుట్టిన సంతానాన్నో,రక్తసంబంధీకులనో తన రాజకీయ వారసుడిగా కాకుండా ప్రశాంత్ కిశోర్ను అందుకు ఎన్నుకోవడం ద్వారా సమకాలీన రాజకీయాల్లో నితీష్ ఒక కొత్త ఒరవడి సృష్టించాడని, అందుకు ఆయనని అభినందించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే నితీష్ ఏమి ఆశించి ప్రశాంత్ కిషోర్ కు ఆ పదవి కట్టబెట్టాడనే విషయమై కూడా రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
ఆయన పిఎం...ఈయన సిఎం...అదీ వ్యూహం
సూటిగా చెప్పుకుంటే...కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం పట్ల, బిజెపి పట్ల దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయం మారినట్లు సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో...వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల కూటమిలే కేంద్రంలో అధికార పీఠాన్ని డిసైడ్ చేస్తాయని నితీష్ కూడా బలంగా విశ్వసిస్తున్నారట. ఆ క్రమంలో ప్రధాన మంత్రిగా సరైన వ్యక్తి , అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం ఆ కూటమి వెతికితే అందులో తాను ముందు వరుసలో ఉంటాననేది నితీష్ నమ్మకమట. అందుకే తాను ప్రధానిగా వెళితే...బీహార్ కు సిఎంగా ప్రశాంత్ కిషోర్ ని చేయాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అదీగాక ఈ క్రమంలో ఇంత కీలకమైన సమయంలో తాను ప్రధాని రేసులో ముందుండటానికి ప్రశాంత్ కిషోర్ సలహాలు తనకు ఎంతగానో ఉపకరిస్తాయని నితీష్ విశ్వసిస్తున్నారట.
ఎపితో లింక్...ఇలాగా
సరే...ఇక ప్రశాంత్ కిషోర్ నిష్క్రమించడంతో...ఎపి రాజకీయాలతో ఇక ఆయనకు సంబంధం ఉండదని భావించవచ్చా?...అంటే అలా అనుకోవడానికి ఆస్కారం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రాంతీయ పార్టీల కూటమి కట్టడంలో నితీష్ చక్రం తిప్పే క్రమంలో ఆయన స్నేహితుడు, ఎపి సిఎం చంద్రబాబుతో అనేక సందర్భాల్లో కీలక చర్చలు జరపాల్సి ఉంటుందని, ఆ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఆ భేటీల్లో పాల్గొనడం అనివార్యమని, వైసిపికి వ్యూహకర్తగా పనిచేసిన పికె దగ్గర ఆ పార్టీకి సంబంధించిన అతి కీలకమైన లోటు పాట్ల సమాచారం ఉంటుంది కాబట్టి...ఆ రకంగా తమ వ్యూహాలు ఎలా ఉండాలో చంద్రబాబు ఆయన సలహాలు తీసుకునే అవకాశం తోసిపుచ్చలేమని మరికొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో...పీకే భవితవ్యం ఏమిటనేది కొన్ని నెలలు వేచి చూస్తే తేలిపోనుంది.