మంత్రి అనిల్ ఎదురుగా కృష్ణానదిలో కొట్టుకుపోయిన వృద్ధుడు: రక్షించడం చేత కాదా?: నారా లోకేష్!
విజయవాడ: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. కృష్ణానదీ ప్రవాహానికి కొట్టుకుని వచ్చి, ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డు పడ్డ ఓ బోటును తొలగించే క్రమంలో.. ఓ వృద్ధుడు పొరపాటున కిందికి జారిపడ్డారు. నదీప్రవాహంలో కొట్టుకుని పోయారు. ఆ సమయంలో జల వనరుల శాఖ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అక్కడే ఉన్నారు. వారితో పాటు జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, జిల్లా, పోలీసు యంత్రాంగాలు సంఘటనాస్థలంలోనే ఉన్నాయి. వారి కళ్ల ముందే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
కొద్దిరోజులుగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షలకు కృష్ణా నది పోటెత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా- ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉప్పొంగింది. ఫలితంగా- ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి ఓ బోటు కొట్టుకుని వచ్చి, ప్రవాహానికి అడ్డు పడింది. తాజాగా- వరద ఉధృతి తగ్గిపోవడంతో.. ఆ పడవను తొలగించడానికి జిల్లా పాలనా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దీన్ని పర్యవేక్షించడానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ ఇంతియాజ్ ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నారు.
ప్రకాశం బ్యారేజి గేటుకి అడ్డంగా ఉన్న చిన్నబోట్ తియ్యలేని చేతగాని ప్రభుత్వం, మంత్రి సాక్షిగా ఒక అమాయకుడి ప్రాణాన్ని మింగేసింది. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి మరీ ఇంత చులకనేంటి? గేట్లు తెరిచే ముందు కనీస హెచ్చరికలు చేయాలని తెలీదా? ఏమిటీ అహంకారం? మంత్రి సమక్షంలోనే ఇలా జరగడం దారుణం. pic.twitter.com/Fc9MMyBZCT
— Lokesh Nara (@naralokesh) August 24, 2019
బోటును తొలగించే పనులను చూడటానికి పెద్ద ఎత్తున స్థానికులు బ్యరేజీ మీదికి చేరుకున్నారు. ఆ సమయంలో ఎం అప్పన్న అనే వృద్ధుడు పొరపాటున బ్యారేజీ పైనుంచి నదిలో పడ్డారు. ఆ సమయంలో ఆయన సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వరద ప్రవాహానికి ఆయన కొట్టుకునిపోయారు. దీన్ని గమనించిన వెంటనే- ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అప్పన్నను రక్షించాయి. ఆయనను ఒడ్డుకు తీసుకుని వచ్చాయి. అప్పటికే కొసప్రాణాలతో ఉన్న ఆయన ఉదర భాగాన్ని గట్టిగా అదుముతూ, గుండెకు రాపిడి ఇవ్వడానికి ప్రయత్నించారు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. అయినప్పటికీ- ఫలితం లేకుండా పోయింది. అప్పన్న సంఘటనాస్థలంలోనే కన్నుమూశారు.
కాగా- ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పుష్కరాల్లో 29 మంది మరణానికి తమ ప్రభుత్వమే కారణమంటూ గతంలో ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు.. గేట్లకు అడ్డుపడ్డ చిన్న బోటును తొలగించడం చేత కాలేదని ఆరోపించారు. ఓ అమాయకుడి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజి గేటుకి అడ్డంగా ఉన్న చిన్నబోట్ తియ్యలేని చేతగాని ప్రభుత్వం అని మండిపడ్డారు. మంత్రి సాక్షిగా ఒక అమాయకుడి ప్రాణాన్ని నిర్లక్ష్యం మింగేసిందని విమర్శించారు. ప్రజల రక్షణలో ప్రభుత్వం వంద శాతం విఫలమైందని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.