17వేల కోట్లతో కడపలో స్టీల్ ప్లాంట్...ముందుకొచ్చిన కంపెనీ:ముందే పేరు వెల్లడించొద్దని షరతు!
అమరావతి:రాష్ట్రంలో రూ.17 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు ఒక అంతర్జాతీయ కంపెనీ ముందుకొచ్చిందని ఎపి ఈడీబీ అధికారులు వెల్లడించారు.
ఇందుకోసం ఆ కంపెనీ ప్రతినిథులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి(ఈడీబీ), సీఎం చంద్రబాబుతో సమావేశం అయినట్లు తెలిపారు. అయితే తమ సంస్థ పేరును ఎక్కడా వెల్లడించవద్దంటూ ఆ కంపెనీ యాజమాన్యం షరతు పెట్టిందని తెలిసింది. సంస్థ కోరిక మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేంతవరకూ ఆ కంపెనీ పేరును బైటకు పొక్కనీయబోమంటూ ఆ కంపెనీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం.
కేంద్రం నో...సంస్థ సై
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో కేంద్రం ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సి ఉంది. కానీ, కేంద్రం ఆ హామీని నెరవేర్చేందుకు ముందుకు రాని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కడప ఉక్కు ప్లాంట్ కోసం అనేక ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో ఇటీవలే టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆమరణ దీక్షకు సైతం దిగిన సంగతి తెలిసిందే. అయినా కేంద్రంలో కదలిక లేకపోవడంతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రయత్నాలు ప్రారంభించింది.
ముందుకొచ్చిన...ఇంటర్నేషనల్ కంపెనీ
కడపలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు అనుకూల అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు ఖనిజాల అధ్యయన సంస్థ మెకన్సీ నివేదిక కూడా ఇచ్చింది. ఈ క్రమంలో దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 2200 ఎకరాలను కేటాయించింది. కడప,కర్నూలు,అనంతపురం జిల్లాల్లోని ఇనుప ఖనిజం నిల్వలనూ రిజర్వు చేసి ఉంచింది.మరోవైపు రాష్ట్ర ఖనిజాభిృద్ధి సంస్థ, ప్రైవేట్ సంస్థల కలయికలో జాయింట్ వెంచర్పై కడపలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వమే నడుంబిగించింది. ఇది తెలుసుకొన్న ఒక అంతర్జాతీయ కంపెనీ కడపలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది. ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్ను సంప్రదించి తమ సంసిద్దత వ్యక్తం చేసింది.
అయితే...పేరు చెప్పొద్దు
అయితే తమ సంస్థ పేరును ఎక్కడా వెల్లడించవద్దంటూ ఆ కంపెనీ యాజమాన్యం షరతు పెట్టిన క్రమంలో పెట్టుబడుల ప్రక్రియ పూర్తయేంతవరకూ మీ సంస్థ పేరును పొక్కనీయబోమంటూ ఆ కంపెనీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ అనంతరం బుధవారం సీఎం చంద్రబాబుతో ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. కడపలో వనరుల లభ్యతపై సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా...కడపతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు గల అవకాశాలపై అన్వేషణ చేస్తామని వారు ప్రతిపాదించినట్లు తెలిసింది.
ముందు కడపలోనే...ఉద్యోగాల వెల్లువ
ఆ సంస్థ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఈడీబీ అధికారులు వెల్లడించారు. అయితే తొలుత భారీస్థాయిలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్న కడపలోనే స్టీల్ ప్లాంటును స్థాపించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈడీబీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రాయలసీమ యువతకు వేలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని వారు చెబుతున్నాయి.
మరికొన్ని...భారీ ప్లాంట్లు
అలాగే మరోవైపు రూ.1000 కోట్లతో చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో సహా మరో రెండు చోట్ల హింద్వేర్ తయారీ ప్లాంట్లను స్థాపిస్తామంటూ ఆ సంస్థ ఎండీ సందీప్ సొమానీ వెల్లడించారు. ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్తో కలసి బుధవారం సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. శానిటరీవేర్ తయారీ ప్లాంట్లను చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు మరో రెండుచోట్ల కూడా ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామని ఆయన వివరించారు. విశాఖలో ప్లాంటును నిర్వహిస్తోన్న ఎల్జీ కెమ్ పాలిమర్స్ సంస్థ పెట్రో కెమికల్ రంగంలో విస్తరణకు సిద్ధమైంది. ఈ సంస్థ ప్రతినిధులు కూడా బుధవారం సీఎంతో సమావేశం అయ్యారు. రూ.2500కోట్ల దాకా పెట్టుబడులు పెడతామని...వీటికి సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వస్తామని వారు మీడియాకు వెల్లడించారు.