ఎంపీ విజయసాయిరెడ్డిపై పోస్ట్ .. ఏపీలో మరో సోషల్ మీడియా కేసు ..వృద్ధుడు అరెస్ట్
ఏపీలో సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు ఊహించని తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి గానీ, ప్రజాప్రతినిధులకు గానీ, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులకు గాని వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించి సిఐడిని రంగంలోకి దింపిన ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో రంగనాయకమ్మ,ఈమధ్య నందకిషోర్, నందిగామ కృష్ణ, ఇక ఇప్పుడు నరసింహారావు అనే వృద్ధుడు సోషల్ మీడియాలో పోస్ట్ ల కారణంగా చిక్కుల్లో పడ్డారు.
సిఐడీ అదుపులో గంటా సన్నిహితుడు నలంద కిషోర్ .. మరో నేత కూడా ... ఇప్పుడు వారికీ టెన్షన్
విజయసాయిపై పెట్టిన పోస్ట్ ఫార్వార్డ్ .. కేసు నమోదు
సోషల్ మీడియాలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రత్నంపేట లో నివాసముండే నరసింహారావు అనే వ్యక్తి విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులు ఫార్వార్డ్ చేయడం తో సిఐడి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. నరసింహారావు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పై గుంటూరు జిల్లా మంగళగిరి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేసి రామచంద్రపురంలో నరసింహారావును అరెస్టు చేశారు. అతన్ని మంగళగిరి కి తీసుకు వెళ్లిన పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.
పోస్ట్ షేర్ చేసినందుకు నరసింహారావు అనే వృద్ధుడు అరెస్ట్
నరసింహారావు విషయానికి వస్తే కుటుంబ సమస్యలతో భార్య,కుమారుడు మరోచోట నివాసముంటున్నారు. వృద్ధుడైన నరసింహారావు హృద్రోగ సమస్య లతో బాధపడుతున్నాడని చెప్పిన బంధువులు ఆయనను అరెస్టు చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నరసింహారావు కూడా తాను పోస్ట్ పెట్టలేదని, పెట్టిన పోస్టులు మాత్రమే ఫార్వర్డ్ చేశాను అని పోలీసులకు చెప్పినా పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని బంధువులు అంటున్నారు.
వరుసగా సోషల్ మీడియా పోస్ట్ లను టార్గెట్ చేస్తున్న ఏపీ సీఐడీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి పై వచ్చిన పోస్ట్ ను ఫార్వర్డ్ చేసిన నేపథ్యంలోనే వృద్ధుడు నరసింహారావు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి, ఒక మంత్రి కి సంబంధించిన పోస్టులను ఫార్వర్డ్ చేసినందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడైన నందకిషోర్ ను , కృష్ణా జిల్లా నందిగామకు చెందిన కృష్ణను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా మరో వృద్ధుడికి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ తలనొప్పి తెచ్చిపెట్టింది.
Recommended Video
ప్రతిపక్షాల మండిపాటు
సోషల్ మీడియా వేదికగా ప్రజల ప్రశ్నించే హక్కు కూడా వైసిపి హరించివేస్తుంది అని, అధికార వైసీపీ తీరు దారుణమని మండిపడుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో భాగస్వాములై పనిచేసేవారిని కించపరిచే పోస్టులు పెడితే ఐపీసీ సెక్షన్ 124 ఎ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. ఇక ఈ సెక్షన్ ప్రకారమే నరసింహారావుపై కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది .