టిడిపి మహిళా సర్పంచ్ వివాదంలో అనూహ్య మలుపు;ఉద్రిక్తత
కృష్ణా జిల్లా:భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా తేలప్రోలు సర్పంచ్ హరిణీ కుమారి వివాదం అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకుంది. తన భర్త వేధిస్తున్నాడని సర్పంచ్ హరిణీ కుమారి ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఒకరు లైక్ కొట్టడంతో ఈ వివాదానికి కారణమైంది.
భర్త వేధింపుల గురించి సర్పంచ్ హరిణీ కుమారి ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు తేలప్రోలుకు చెందిన భీమవరపు నాగిరెడ్డి లైక్ కొట్టాడు. ఇది తెలిసిన హరిణీకుమారి భర్త రామకృష్ణ సీతారామపురం వైసీపీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి నా భార్య పోస్టుకు లైక్ ఎందుకు కొట్టావంటూ నాగిరెడ్డితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో ఈ విషయం రెండు పార్టీల నేతలకు తెలిసి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది.
భర్త జితేంద్ర రామకృష్ణ నుంచి తనకు ప్రాణహాని ఉందని తేలప్రోలు సర్పంచ్ హరిణికుమారి రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదుచేసింది. హరిణి భర్త జితేంద్ర రామకృష్ణ తెలుగుయువత నాయకుడు. తన విజయవాడలోని హోటల్లో ఉంటూ ఇంటికి రావడంలేదని, కారణం అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని హరిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఏడాది నుంచి తనను వేధిస్తున్నారని ఆమె వాపోయింది. తనపై జరిగిన దాడి విషయంపై పోలీసులకు ఆధారాలతో సహా ఇచ్చింది.
సర్పంచ్ ఒంటిపై ఉన్న గాయాలను మీడియాకు చూపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. హరిణి ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు తన శరీరంపై ఉన్న గాయాలకు సంబంధించిన వీడియోను హరిణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ హరిణీ కుమారి ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త నాగిరెడ్డి లైక్ కొట్టడం ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో రెండు పార్టీల మద్దతుదారులు మరోసారి దాడులు చేసుకునే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తపై బందోబస్తు ఏర్పాటుచేశారు.