ఊహించని ట్విస్ట్ : పెళ్లి చేసుకుని.. పోలీస్ స్టేషన్ కు వెళితే..!
తుని : వాళ్లిద్దరు వరుసకు బావ మరుదళ్లు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. అయితే పెళ్లికి పెద్దలు 'నో' చెప్పడంతో ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. కట్ చేస్తే.. వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి. అనంతరం రక్షణ కల్పించండంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇక్కడే ఆ జంటకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆ జంటను తల్లిదండ్రులకు అప్పగించేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నానికి చెందిన యువకుడు సింహగిరి, శ్రీకాకుళానికి చెందిన కళశ్రీలు ఆరేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు బావ మరుదళ్లే అయిన పెద్దలు మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోలేదు.
అబ్బాయి విశాఖలో యానిమేటర్ గా పనిచేస్తుండగా.. అమ్మాయి ఒరిస్సాలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 22న ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం తుని చేరుకుని స్థానిక పాతబజారువీధిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్ళి చేసుకున్నారు.
అయితే విశాఖలోని తమ కుమారుడి వద్దకు వచ్చిన కుమార్తె కనిపించడం లేదంటూ అప్పటికే అమ్మాయి తల్లిదండ్రులు విశాఖ ద్వారకానగర్ లో ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో రక్షణ కోసం ఈ కొత్త జంట తుని పోలీసులను ఆశ్రయించగా.. అంతకుముందే ద్వారకానగర్ లో మిస్సింగ్ కేసు నమోదవడంతో విశాఖ పోలీసులకు సమాచారం అందించారు తుని పోలీసులు.
దీంతో తుని పోలీసులు, విశాఖ పోలీసులు ఇరువురు కలిసి కొత్త జంటను తల్లిదండ్రులకు అప్పగించేశారు.