జగన్ తో భేటీపై ఆనం వివేకా కుమారుడి సంచలనం...ఆనం జయకుమార్ కు టిడిపి పదవి
నెల్లూరు:టిడిపి అధిష్టానం వైఖరితో మనస్థాపం చెంది ఆనం కుటుంబం టీడీపీని వీడుతుందని, జగన్ పార్టీలోకి వెళ్తున్నామని, ఆయనతో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆనం వివేకా కుమారుడు, నెల్లూరు 12వ డివిజన్ కార్పొరేటర్ ఆనం రంగమయూర్రెడ్డి ఘాటుగా స్పందించారు.
తమ కుటుంబం గురించి వస్తున్న పుకార్ల వాస్తవం కాదని ఆనం రంగమయూర్రెడ్డి అన్నారు. సోమవారం తన డివిజన్ పరిధిలోని సౌత్రాజుపాళెంలో నిర్వహించిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్తో మేము ఎవరూ టచ్లో లేమని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి మేయర్ పదవులు ఇస్తారంటూ వస్తున్న కథనాల్లోనూ వాస్తవం లేదని ఆయన తేల్చేశారు.
చెప్పే వెళ్తాం...ఆనం రంగమయూర్
తమకు పార్టీ మారే ఆలోచన లేకపోయినా ఆత్మీయులతో సంప్రదించాక ముందుగా నిర్ణయాన్ని వెల్లడించే ఆపైన తుది అడుగు వేస్తామని ఆనం రంగమయూర్రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం ఆనం జగన్తో భేటీ అయ్యారన్నది వాస్తవం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
ఆనం జయకుమార్ కు...టిడిపి పదవి
మరోవైపు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా ఆనం జయకుమార్రెడ్డి నియమితులు కానున్నట్లు టిడిపి వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ సైతం వచ్చినట్లు తెలిసింది. టీడీపీ పట్ల అభిమానం, నగర రాజకీయాలపై అనుభవాలు ప్రధాన అర్హతలుగా జయకుమార్రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేశారు. బీసీ, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త నగర కమిటీ ఏర్పాటు కు కసరత్తు జరుగుతోంది. ఈ జాబితాతో నేడోరేపో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర రాజధానికి వెళ్లనున్నారు. త్వరలో నగరానికి కొత్త కమిటీని అధికారికంగా ప్రకటించనున్నారు.
విధేయతే...పదవిని తెస్తోందా?
ఆనం జయకుమార్రెడ్డిని నగర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి...ఆయన పార్టీ పట్ల చూపుతున్న విశ్వాసం...నగర రాజకీయాలపై ఆయనకు ఉన్న అనుభవం...ప్రధాన కారణాలుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జయకుమార్రెడ్డి ఆనం వివేకా, రామనారాయణ రెడ్డిల కన్నా ముందే మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంట టిడిపిలోకి అడుగుపెట్టారు. తాజాగా ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ వీడిపోతున్న తరుణంలో సైతం జయకుమార్రెడ్డి తెలుగుదేశంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న అభిమానం చంద్రబాబును ఆకర్షించింది. అలాగే నగర రాజకీయాలపై ఆయనకు ఉన్న అనుభవం కూడా అధ్యక్షపదవికి అర్హత సంపాదించి పెట్టింది.
Recommended Video
అందరూ...సానుకూలమే
ఆనం వివేకానందరెడ్డి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా కొనసాగిన రోజుల్లో నగర పార్టీ బాధ్యతలను జయకుమార్రెడ్డే చూసేవారు. ఈ క్రమంలో నగరంలో ఈయనకు విస్తృత మైన ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో నగరంపై పూర్తి స్థాయి అవగాహన కలిగిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని టిడిపి అధిష్ఠానం ఆలోచించింది. ఈ క్రమంలో జయకుమార్రెడ్డిని నగర అధ్యక్షుడిగా నియమించమని పార్టీ అధినేతే జిల్లా పార్టీ అధ్యక్షునికి, మంత్రులకు సూచించారట. ఆ క్రమంలో ఆనం జయకుమార్రెడ్డిని నగర పార్టీ అధ్యక్షున్ని చేసేందుకు చర్యలు మొదలైనట్లు తెలిసింది.