రాజ్యసభ డీల్: ఆదాల బంధుత్వం, జగన్ ఏం చెప్తారు?
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించవచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో ఆదాలకు సహకరించేందుకు జగన్ పార్టీ శాసనసభ్యుడు, ఆదాల బంధువు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముందుకు వచ్చారని అంటున్నారు.
ఇప్పటికే ఈ అంశం పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. ఆదాలకు మదతిచ్చేందుకు జగన్ అంగీకరించారా? అనే చర్చ సాగుతోంది. పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పుట్టించాయి. ప్రస్తుతం జగన్ పార్టీకి 23 మంది శాసనసభ్యులున్నారు.
మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కూడా సమైక్యవాదాన్ని వినిపించే ఆదాలకే ఓటేస్తానని చెబుతున్నారు. మరో ఏడుగురిని సమీకరిస్తానని కూడా జెసి అంటున్నారు. అదే జరిగితే ఆదాలతో కలిపి ఆయన వర్గంలో 32మంది ఉంటారు. ఇది కాంగ్రెస్ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. అయితే రెబల్ అభ్యర్థి విషయంలో భయపడాల్సిందేమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురూ విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇదే అనుమానాన్ని ముఖ్యమంత్రి ఎదుట వ్యక్తం చేశారు. కిరణ్ మాత్రం మన అభ్యర్థులే గెలుస్తారని వారికి చెప్పారు. జగన్కు ఆదాలకు కోట్లాది రూపాయల డీల్ కుదిరిందని ఆనం వివేకానంద రెడ్డి కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఇన్నాళ్లు ఆదాల తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే, సమైక్యం కోసమే ఆదాల నిలబడ్డారని జెసి దివాకర్ రెడ్డి చెబుతున్నారు.