నిర్మాత సి. కళ్యాణ్ వ్యాఖ్యలు: భగ్గుమన్న ఆనం గ్రూప్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ పిసిసి ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డిపై మేయర్ అబ్దుల్ అజీజ్, సినీ నిర్మాత సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆనం వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం జెండా వీధిలో మేయర్, కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు.
దాంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై తర్వాత స్పందిస్తానని ఆనం వివేకా తెలిపారు. ‘రంభతో లాలికాడు' అనే పేరుతో ఆనం వివేకానంద రెడ్డిపై సినిమా తీస్తానని సి. కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నెల్లూరులోని ప్రెస్క్లబ్లో సి. కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఆయన వికారపు చేష్టలను పరిగణలోకి తీసుకుని ఇలాంటి నాయకులు ఎలా ఉంటారో చెప్పడానికి ‘రంభతో లాలికాడు' సినిమా తీసే ఆలోచన ఉందని ఆయన అన్నారు.
తాను కొనుగోలు చేసిన స్థలంలో భాగం ఇవ్వలేదన్న కారణంతో ఆ స్థలం వక్ఫ్బోర్డుకు చెందినదంటూ.. వివేకా బ్లాక్మెయిల్ చేస్తున్నారని సికళ్యాణ్ ఆరోపించారు. నెల్లూరు రామ్నగర్లో 2008లో మక్సూద్ ఆలీ అనే వ్యక్తి వద్ద తాను రూ.1.60కోట్లకు స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. స్థలంలో వాటా ఇవ్వనందుకే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బెదరించారని ఆరోపించారు.
వివేకానంద సెల్ఫోన్లో ఎప్పుడూ ఆయన డ్రీమ్ గర్ల్ ఫొటో ఉంటుందని, మొబైల్లో ఎటువంటి బొమ్మలు వస్తాయో అందరికి తెలుసని కళ్యాణ్ విమర్శించారు. ఆయన వ్యవహార శైలిపై రంభతో లాలికాడు సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. తనతో పెట్టుకుంటే మసైపోతావంటూ ఆయన ఆనం వివేకానంద రెడ్డిని హెచ్చరించారు. "నువ్వు బయటకు రావాలంటే మంది కావాలి. నేను ఒక్కడినే వస్తా. ఏ సెంటర్కైనా వస్తా. నువ్వు ఎంత మందినైనా తెచ్చుకో బస్తీ మే సవాల్ కొట్టుకుందాం రా'' అంటూ సి.కళ్యాణ్ సవాల్ విసిరారు.