బాధపడటం తప్ప ఏం చేయలేం: ఆనం, కిరణ్పై సెటైర్లు
కలిసికట్టుగా రెండు ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం పైన అందరు దృష్టి సారించాలని హితవు పలికారు. అనేక ఉద్యమాలు, త్యాగాల తర్వాతనే విభజన జరిగిందన్నారు. కలిసి ఉండాలనే తమ ప్రయత్నం విఫలమైందన్నారు. ఇక కాంగ్రెసు పార్టీని సీమాంధ్రలో కాపాడుకోవాల్సిన బాధ్యత తమ పైన ఉందన్నారు. అధికారంలో తాము ఉన్నాం కాబట్టి నింద తమ పైన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ద్వారా ఓ ప్రాంతంలో నిందను, మరో ప్రాంతంలో సంతోషాలను తాము చవి చూస్తున్నామన్నారు.
మా కల నెరవేరిందని, 42 ఏళ్లుగా మీతో పోరాడామని, మేం గెలిచాం, మీరు ఓడిపోయారని తనకు ఫోన్లు వచ్చాయని, అవి వింటుంటే తనకు బాధగా అనిపించినా తప్పడం లేదన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, సిపిఐ అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాతనే కాంగ్రెసు తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ, అధికారంలో ఉన్నందున నిందను మోయాల్సి వస్తోందన్నారు.
టిడిపి సమన్యాయం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర పేరుతో సీమాంధ్ర ప్రజల గొంతును కోశాయన్నారు. కాంగ్రెసు నిర్ణయం ఓ ప్రాంతంలో సంతోషాన్నివ్వగా, మరో ప్రాంతంలో బాధను ఇచ్చిందన్నారు. సమైక్య హీరోలుగా చెప్పుకునే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన బాధాకరమైన దాని నుండి బయటపడాల్సి ఉందన్నారు.
అధికారంలో కాబట్టి తాము ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. మాతో పాటు విభజనకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి మేలు చేయాలని కాంగ్రెసు పార్టీ ప్యాకేజీ ఇచ్చిందన్నారు. మీడియాకు భయపడే తాము సీమాంధ్రకు ప్యాకేజీ అడగలేకపోయామన్నారు. ప్యాకేజీ అడిగితే ఎక్కడ విభజన వాదులు అంటారోనని భయపడ్డామన్నారు.
కిరణ్ పైన సెటైర్లు, ఆగ్రహం
కిరణ్ కుమార్ రెడ్డి పైన ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నేతలు పార్టీలో అన్ని పదవులు అనుభవించి, ఇప్పుడు కాంగ్రెసు పార్టీ తప్పు చేసిందని చెప్పి బాధ్యతల నుండి తప్పుకున్నారన్నారు. కార్యకర్తలు కార్యకర్తలుగా ఉన్నారని, నాయకులు మాత్రం పార్టీని దోషిగా చేస్తున్నారన్నారు.
పార్టీలో అన్ని పదవులు అనుభవించారని, వారి పెద్దలు, వారు అనుభవించడమే కాక, భవిష్యత్తు తరాలకు బాటలు వేశారన్నారు. ఇప్పుడు తప్పుకున్నారన్నారు. తాము కాంగ్రెసు పార్టీ పునర్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా అందరు నిలబడాలన్నారు. కిరణ్ సహా ఎవరు పార్టీ వీడకూడదని కోరుకుంటున్నానని చెప్పారు.