టార్గెట్ జగన్: ఆనం వివేకానంద మౌనం వెనుక, తమ్ముడికి మంత్రి పదవి?
నెల్లూరు: ఆనం సోదరులకు త్వరలో పదవి వరించే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనం సోదరుల్లో ఒకరైనా రామనారాయణ రెడ్డిని సీఎం చంద్రబాబు కేబినెట్లోకి తీసుకోవచ్చునని ప్రచారం సాగుతోంది. అధికారంలో ఉంటే ఆనం కుటుంబానికి పదవులు దక్కుతుంటాయి.
ముఖ్యమంత్రి పదవి తప్ప కేబినెట్లోని దాదాపు అన్ని శాఖలనూ నిర్వర్తించింది ఆ కుటుంబం. టీడీపీలో చేరి ఇన్నాళ్లయినా ఆనం బ్రదర్స్కు ఆశించిన పదవి మాత్రం రాలేదు. దీంతో తొలుత దూకుడు చూపించిన ఆ సోదరులు.. ఇప్పుడు కాస్త చల్లబడ్డారని అంటున్నారు.
అందుకు టీడీపీలోకి వచ్చారు
టీడీపీలో ఉంటే తమ జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చని ఆనం బ్రదర్స్ భావించారు. ఆనం వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ, రామనారాయణకు మంత్రి పదవి ఇస్తామని టీడీపీ అధిష్టానం వారి చేరిక సమయంలో హామీ ఇచ్చిందని ప్రచారం సాగింది. కానీ ఇప్పటి వరకు అవి నెరవేరలేదు.
మౌనంగా ఆనం వివేకానంద
టిడిపిలో చేరిన ప్రారంభంలో వివేకానంద రెడ్డి వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన మౌనంగా ఉన్నారు. దీనికి కారణం ఆయన అనారోగ్యానికి గురికావడమేనని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. వివేకానందరెడ్డి ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేకపోతున్నారని అంటున్నారు.
ఆయన రాజ్యసభకు, ఆ స్థానంలో ఆనం
ఈ నేపథ్యంలో ఆనం వివేకాకు పదవి ఇవ్వలేరు కాబట్టి రామ నారాయణరెడ్డికి అయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారి మద్దదుతారులు కోరుతున్నారు. ఈ విషయమై సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామనారాయణరెడ్డికి మంత్రి పదవి అప్పగించి, సీనియర్ మంత్రి అయిన ఓ నేతను రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ధీటుగా ఎదుర్కొనే నేత లేకేనా
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీకి సరైన కౌంటర్ ఇచ్చే అధికార పక్ష నేతలు ఎవరూ లేరు. జిల్లాలో బీజేపీ-టీడీపీ కలిసికట్టుగా వ్యవహరించడం లేదనే వాదనలు ఉన్నాయి. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ నేతలను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని, అధిష్టానం సూచన మేరకే లేక ఇతర కారణలవల్లో బీజేపీ నేతల వ్యాఖ్యలను కూడా పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయని అంటున్నారు.
ఆనం రామనారాయణకు పదవి ఇస్తే
మరో మంత్రి నారాయణ ఎలాంటి వివాదాలు లేకుండా ఎవరినీ పల్లెత్తిమాట కూడా అనకుండా తన పని తాను చేసుకు వెళ్తున్నారని, ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలను గట్టిగా తిప్పికొట్టే నేతలు కరువయ్యారని, ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణకు పదవి ఇస్తే బావుంటుందని ఆనం బ్రదర్స్ వర్గం భావిస్తోందంట.
వైసీపీలోకి వెళ్లిన తన క్యాడర్ను తీసుకొద్దామంటే
ఆనం వారికి నెల్లూరు జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. అందరినీ కలుపుకొనిపోయి పార్టీని ముందుకు నడిపించగల శక్తి రామనారాయణ రెడ్డిలో ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆత్మకూరు ఇంచార్జిగా ఆ నియోజకవర్గంలో మండల కమిటీల నుంచి బూత్ లెవెల్ కమిటీల వరకూ క్యాడర్ను నియమించుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వాళ్లను మళ్లీ సొంతగూటికి తీసుకురావాలని ఆనం బ్రదర్కు ఉన్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని వారు అభిప్రాయపడుతున్నారు. రామనారాయణకు పదవి ఇస్తే టీడీపీ మరింత బలపడుతుందని వారి వర్గం భావిస్తోందట.
ఆనం రామనారాయణ వారిస్తున్నారా?
తనకు మంత్రి పదవి ఇవ్వాలని తన మద్దతుదారులు డిమాండ్ చేస్తుంటే ఆయన మాత్రం వారిస్తున్నారని తెలుస్తోంది. పదవులు కొత్త కాదని చెబుతున్నారట. అయితే వారు అసంతృప్తితోనే అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. టీడీపీలో చేరే ముందు తమకు హామీ ఇచ్చారని మద్దతుదారులు గుర్తు చేస్తున్నారని తెలుస్తోంది.