ఇక టీడీపీలో ఉండలేను, అపొహలొద్దు 20నే ప్రకటన: తేల్చేసిన ఆనం, జగన్ పార్టీలోకేనా?
నెల్లూరు: గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరవేస్తూ.. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం రామనారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
టీడీపీ మోసం చేయలేదు కానీ: ఆనం రామనారాయణ ట్విస్ట్, వైసీపీలోకి వెళ్లడంపై..
ముఖ్య నేతలతో భేటీ
ఆ ప్రచారానికి తోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆనం రామనారాయణ రెడ్డి గైర్హాజరవడంతో ఆయన మార్పు ఖరారైందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులతో బుధవారం సమావేశమయ్యారు.
టీడీపీలో ఇంక ఇమడలేను
ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. టీడీపీలో ఇంక ఇమడలేమని, పార్టీ వీడాలని నిర్ణయించుకొన్నట్లు వివరించారు. అందుకు దారి తీసిన కారణాలు ఆయన వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఈ విషయంలో అపోహ వద్దని నాయకులకు స్పష్టం చేశారు.
20నే ప్రకటన
ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం జూన్ 20వ తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి నిర్ణయిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
జిల్లా రాజకీయాలపై ప్రభావం
ఈ క్రమంలో మాజీమంత్రి ఆనం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చేరతారని నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు, దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డికి జిల్లా స్థాయిలో అనుచరగణం, అభిమానులు, నాయకులు భారీగానే ఉన్నారు. దీంతో ఆనం ఏ నిర్ణయం తీసుకున్న జిల్లా రాజకీయాలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపనుంది. ఇటీవల ఆనం వివేకానంద రెడ్డి ఆకస్మకంగా మృతి చెందిన విషయం తెలిసిందే.