జగన్పై దాడి.. నిఘా వ్యవస్థ ఏమైంది, శివాజీనీ ఎందుకు ప్రశ్నించడం లేదు: బాబుపై ఆనం నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నారాసుర రాజకీయ పాలనా వధ జరిగితేనే ప్రజలకు నిజమైన దీపావళి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం అన్నారు. అప్పుడు ఏపీ ప్రజలు నిజమైన దీపావళి జరుపుకుంటారని చెప్పారు. టిట్లీ తుఫాను నష్టపరిహారం బాధితుల చెక్కులపై చంద్రబాబు బొమ్మ ఎలా పెట్టుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు.
చిరంజీవినే ఎదిరించా, అలా చేయకుంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు: బాబుపై జనసేనాని నిప్పులు
టిట్లీ తుఫానులో పేదలను ఆదుకునే ప్రయత్నం జరగలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని చెప్పారు. విపక్షాల నోరు నొక్కేస్తున్నారని ఆరోపించారు.
శివాజీని ఎందుకు ప్రశ్నించడం లేదు
వాళ్లపై దాడి జరుగుతుందని, ఏపీలో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటాయని నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ పేరుతో ఎప్పటి నుంచో చెబుతున్నాడని, అలాంటి అంశంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదని ఆనం ప్రశ్నించారు. శివాజీని ఆపరేషన్ గరుడపై ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమయ్యారో చెప్పాలన్నారు. శివాజీని ఎందుకు పిలిచి విచారించడం లేదని ఆయన డీజీపీని ప్రశ్నించారు. ప్రభుత్వాలను కూల్చేసే అంశాలు అంటూ ఆయన మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తిని ఎందుకు విచారించడం లేదన్నారు.
పొరుగు రాష్ట్రంలో ఓట్లు కొనేందుకు వెళ్లారు
ఇంటెలిజెన్స్ పొరుగు రాష్ట్రం (తెలంగాణ)లో ఓట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లిందని ఆనం ఆరోపించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల ప్రజాప్రతినిధులు బలయ్యారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గద్దె దించినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలైన దీపావళి అని చెప్పారు. తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే తన రాజకీయ స్వార్థానికి వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. హుధుద్, టిట్లీ తుఫానును రాజకీయ స్వార్థానికి వాడుకున్నారని చెప్పారు.
జగన్పై దాడి: నిఘా వ్యవస్థ ఏమయింది?
చంద్రబాబు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆనం ఆరోపించారు. చంద్రబాబు తన స్వార్థానికి ఎంతమందిని బలి చేస్తారని ప్రశ్నించారు. జగన్ పైన దాడి అనేది ఇంటెలిజెన్స్ వైఫల్యమని చెప్పారు. పోలీసు నిఘా వ్యవస్థ ఏమయిందో చెప్పాలని నిలదీశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసు కేసులు పెట్టడం ఏమిటన్నారు.
జాతీయ పార్టీల కూటమిపై చంద్రబాబు డబ్బా
జాతీయ పార్టీలను కూడగట్టానని చంద్రబాబు ఇక్కడ పచ్చ మీడియా ద్వారా డబ్బా కొట్టుకుంటున్నారని, కానీ ఆయన కూడగట్టడం ఏమిటని, వాళ్లే ఎప్పుడో యూపీఏ కూటమిగా ఏర్పడ్డారని ఆనం చెప్పారు. వారి అవసరం కోరి చంద్రబాబు వెళ్లారన్నారు. నీవు చెప్పినట్టు చేసేందుకు వారు సిద్ధంగా లేరన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.
జగన్ మీద దాడిని తక్కువ చూపే ప్రయత్నం
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అని ఆనం ప్రశ్నించారు. జగన్కు ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజాదరణ వస్తోందని చెప్పారు. జగన్ నాయకత్వంలో ప్రజలు భవిష్యత్తులో దీపావళి జరుపుకుంటారని చెప్పారు. జగన్ పైన విశాఖపట్నంలో జరిగిన దాడిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారని, డీజీపీ అరగంట లోపే జగన్ అభిమాని దాడి చేశాడని చెప్పగా, ఆ తర్వాత చంద్రబాబు, హోంమంత్రి అదే మాట చెప్పారని విమర్శించారు. జగన్ మీ దాడి ఘటనపై నిష్పక్షపాత విచారణ కావాలన్నారు. కుట్రలో ప్రధాన భాగస్వామి చంద్రబాబు అని, రెండో భాగస్వామి డీజీపీ అన్నారు. చంద్రబాబు తీరు గురివింద సామెతలా ఉంటుందన్నారు. హోదా కావాలని అసెంబ్లీలో జగన్ అడిగితే ప్యాకేజీ కావాలని చంద్రబాబు తీర్మానం చేశారన్నారు. యూటర్న్లు తీసుకొని పబ్బం గడుపుతూ ఇతర పార్టీలను విమర్శించడం ఏమిటన్నారు.