వైయస్ వర్ధంతి రోజునే జగన్ సమక్షంలో వైసీపీలోకి ఆనం!: మేకపాటి, కాకాణితో చర్చలు, భారీ సభ
అమరావతి/నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు.
విశాఖపట్నం వెళ్లి ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రెండు నెలలుగా టీడీపీకి దూరం
దివంగత వైయస్సార్ హయాంలో, తదనంతర ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణమాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. అయితే పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతోపాటు తదితర కారణాలతో ఆయన రెండు నెలలుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు.
జగన్ సమక్షంలో పార్టీలోకి..
ఈక్రమంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని పార్టీ అధినేత వైయస్ జగన్ను ఇప్పటికే కలిసి మాట్లాడారు. సెప్టెంబర్ 2న జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి పార్టీలో చేరనున్నారు. విశాఖపట్నంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం నెల్లూరులో బహిరంగ సభ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఆనంతో కాకాణి చర్చలు
ఇదిలా ఉండగా శుక్రవారం వైయస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ఆనం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలోకి ఆహ్వానించడానికి వెళ్లి చేరిక తేదీ ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలను కూడా ఆనం కలవనున్నారు.
మేకపాటితో రాజకీయాలు, పార్టీలో చేరికపై చర్చ
కాగా, వైసీపీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితోనూ సమావేశమయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, వైసీపీలో చేరిక తదితర అంశాలపై మేకపాటితో ఆనం ముచ్చటించారు. ఆనం వైసీపీలో చేరతారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం వెంకటగిరి సీటును ఆశిస్తున్నట్లు సమాచారం.