జబర్దస్త్ తర్వాత జగన్ ప్రోగ్రాంల్లో రోజాకి రికార్డింగ్ డ్యాన్సే: ఆనం తీవ్ర వ్యాఖ్య
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపి అధినేత జగన్ కార్యక్రమాల్లో రోజాకు రికార్డింగ్ డ్యాన్సులే గతి అని తీవ్రంగా మండిపడ్డారు.
రోజాకు జబర్దస్త్ ప్రోగ్రామ్ అయిపోతే జగన్ ప్రోగ్రాముల్లో రికార్డింగ్ డ్యాన్సులే మిగులుతాయని ఎద్దేవా చేశారు. జగన్ను 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, 33 ఏళ్ల తెలుగుదేశం పార్టీలు ఏం చేయలేకపోయాయని చెప్పారు. కానీ రోజా ఎక్కడ పాదం మోపితే అక్కడ ఆ పార్టీ సర్వనాశనం ఖాయమని వ్యాఖ్యానించారు.
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వరుస కడుతున్నారని చెప్పారు. రోజా టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అంతకుముందు రోజా టిడిపిలో ఉందని, అప్పుడు టిడిపి అధికారంలోకి రాలేదన్నారు.
టిడిపి ఎంపీల సమావేశం
టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు అందరూ హాజరయ్యారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విద్యుత్ ఉద్యోగుల విభజన, విశాఖకు రైల్వే జోన్ సాధన, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని పెండింగ్ అంశాలపై సమావేశంలో చర్చించారు. 2019 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు.