ఆ మాట మోడీ వింటే జగన్ పని అంతే, రామారావు గొంతు కోశారు: బాబుతో ఆనం సోదరుల భేటీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్.. రాష్ట్రానికి పట్టిన ఓ చీడ పరుగు అంటూ దుయ్యబట్టారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్.. రాష్ట్రానికి పట్టిన ఓ చీడ పరుగు అంటూ దుయ్యబట్టారు. మంగళవారం ఉదయం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుతో ఆనం వివేకానందరెడ్డి, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అయ్యారు.
అనంతరం ఆనం వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరినట్లు తెలిపారు. తాము టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపిస్తామని చంద్రబాబుకు చెప్పామని అన్నారు. తమకు ఎవరిపైనా చాడీలు చెప్పే అలవాటు లేదని అన్నారు. అలాగే తమకు పనులు కావడం లేదన్న ఆక్రోశమూ లేదని చెప్పారు.
చంద్రబాబుకు తెలుసు
తమకు ఉన్న అవసరాలన్నీ తమ నియోజకవర్గంలోని ప్రజల్లో ఒకరికి పెన్షన్ ఇప్పించడం, మరొకరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించడం తప్ప ఇంక పనులేమీ ఉండవని చెప్పారు. తమ గురించి ముఖ్యమంత్రికి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, గత 30 ఏళ్లుగా తామేంటో ఆయనకు తెలుసని అన్నారు. బాబు విద్యార్థి దశ నుంచి ఆయనతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వివేక చెప్పారు.
రామారావు గొంతుకోశారు... బాబును చూసే..
తాము చంద్రబాబును చూసే పార్టీలో చేరామని, తమను, తమ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు చాలా చక్కగా తెలుసని అన్నారు. గతంలో రామారావు గారు రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ ఛైర్మన్ ఇస్తానని చెప్పి, గొంతు కోశారని.. అందుకే పార్టీ వదిలామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు తమకు మేలే చేస్తారని ఆయన తెలిపారు.
జగన్ చీడ పురుగు
కాగా, జగన్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగని, వైయస్ ప్రభుత్వంలోనే అవినీతి ఉందని సర్వేలు తేల్చాయని చెప్పారు. అంతేగాక, జగన్ దీక్ష చేయడంపై ఆనం వివేకానందరెడ్డి పగలబడి నవ్వారు. 'రాష్ట్రమనే పచ్చని చెట్టుకు పట్టిన చీడపురుగు జగన్' అని ఆనం విమర్శించారు. జగన్ దీక్ష చూస్తే... తనకు 'ఒంగోలు గిత్త' సినిమా గుర్తొస్తుందని అన్నారు. ఆ సినిమాలో మిర్చియార్డు ఛైర్మన్గా ప్రకాశ్ రాజ్ నటించాడని... ఉదయాన్నే పూటుగా తయారై ప్రజల ముందుకు వస్తాడని... ప్రజల బాధలు వింటాడు, కన్నీరు పెడతాడు..సాయంత్రం ఇంటికెళ్లి గుడ్డలిప్పి కూర్చుని మందుకొడతాడని అన్నారు. అలా జగన్ దీక్ష ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో కూర్చుంటాడా? అని వివేకానంద ఎద్దేవా చేశారు.
మోడీ వద్ద అంటే అంతే సంగతులు
జగన్ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ‘మనప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నేను ముఖ్యమంత్రినైతే' అంటూ ఉంటారని వివేకానందరెడ్డి ఎద్దేవా చేశారు. మిర్చి గురించే తెలియని పిల్లోడు జగన్ అని అన్నారు. అలాంటోడు దీక్ష చేయడమేంటని ఆయన ఎద్దేవా చేశారు. తండ్రి అధికారం అండగా లక్ష కోట్లు దోచేసిన, జగన్ నీతులు చెబుతున్నాడని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి అవుతానని జగన్ పదేపదే ఏపీలో అంటున్నాడు కనుక పర్లేకపోయిందని, ఈ విషయం 56 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర అంటే జగన్ జీవితాంతం జైల్లోనే ఉంటాడని ఆయన తెలిపారు. వైయస్ ప్రభుత్వంలో అవినీతి ఉందని సర్వేలో తేలిందని ఆయన అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నారని ఆనం స్పష్టం చేశారు.