జగన్ జాతరగా మార్చారు, రోజా పూనకం వచ్చినట్లు...: ఆనం వివేకా
నెల్లూరు/ కర్నూలు/ గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రతిపక్షనేత హోదా మరిచి అసెంబ్లీని జాతరగా మార్చారని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా పూనకం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఎందుకు కట్టడి చేయలేదని ఆయన జగన్ను ప్రశ్నించారు. జగన్ నమ్మినవాళ్లకు ద్రోహం చేశారని, వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో ఖర్చులు భరించిన వారిని మరిచి పోయారని ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు.
ఇదిలావుంటే, కేసీ కెనాల్ కింద పంటలను కాపాడేందుకు జనవరి 15 వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి అన్నారు. శనివారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో రోజా తీరు క్షమించరానిదన్నారు.
ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా సమయాన్ని వృధా చేశారని ఆరోపించారు. జగన్ కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని చక్రపాణి అన్నారు.
రాజధాని నిర్మాణంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ వాడల్లో కనీస వసతులు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ప్రపంచ చిత్రపటంలో అమరావతిని నిలుపుతామని ఆయన తెలిపారు. రాజధాని భూములపై వామపక్షాలు, ప్రతిపక్షం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నామని ఆరోపించారు. కాల్మని నిందితులను ఎంతటి వారైనా వదలమని స్పష్టం చేశారు.