నింగికెగిసిన నెల్లూరు సోగ్గాడు: ఆనం‘దం’ లేక చిన్నబోయిన సింహపురి, ఆయన ఒక్కరే
నెల్లూరు: ఆనం వివేకానందరెడ్డి(67) ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. సింహపురి సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతితో నెల్లూరు జిల్లా చిన్నబోయింది. సుమారు రెండు నెలలకు పైగా ప్రొస్టేట్ క్యాన్సర్తో పోరాడిన ఆయన బుధవారం ఉదయం చికిత్స పొందుతూ హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు.
Recommended Video
టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి మృతి, మంత్రి పదవి వద్దన్న వివేకా
కాగా, ఈ విషయం తెలిసిన నెల్లూరు అభిమానులు, ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్న వివేకానందరెడ్డి.. ఇక లేరనే విషయాన్ని జిల్లా ప్రజలు, నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎదైనా ముక్కు సూటిగానే
ఆనం వివేకానందరెడ్డి ఏ విషయంపై అయినా ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడేవారు. నెల్లూరులో ధర్నా చేయాలన్నా, ప్రతి పక్షాలపై ఎదురుదాడి చేయాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్లు ఆయన వ్యవహారం ఉండేది.
మంత్రి పదవి తమ్ముడికి ఇచ్చేశారు..
ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత జిల్లా రాజకీయాలపై వివేకానందరెడ్డి క్రమంగా పట్టు సాధించారు. వైయస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. నెల్లూరు జిల్లా రాజకీయాలంటే ఆనం బ్రదర్స్ అన్నట్లుగా మార్చేశారు. వైయస్ స్వయంగా మంత్రి పదవి ఇస్తానని ఆహ్వానించినా వినమ్రంగా తిరస్కరించి.. తన తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పించారు.
సినిమాలంటే పిచ్చి
తనకు సినిమాలంటే పిచ్చి అని, సినిమాలు చూడకుండా ఉండలేనని స్పష్టం చేశారు. ఆయన మంత్రి పదవి వద్దనడానికి ఇది కూడా ఓ కారణం కావడం గమనార్హం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్య ఉండే వివేకా.. రోజూ సెకండ్ షో చూసి ఇంటికెళ్లేవారు. ఇక భోజన విషయానికి వస్తే రోజూ రెండు పూటలా బిర్యానీ ఉండాల్సిందే.
ఆనం ఒక్కరే
సినిమాల్లో, మార్కెట్లోకి కొత్తగా వచ్చే అన్ని స్టైల్స్ ఆనం అనుకరించేవారు. హెయిర్ స్టైల్తో పాటు సెల్ ఫోన్ల వినియోగంలోనూ వివేకా తనదైన ముద్ర వేశారు. మార్కెట్లోకి వచ్చే ఏ కంపెనీ కారైనా ముందుగా ఆయన వాడాల్సిందే. రాజకీయాల్లో ఉంటూనే జీవితాన్ని తనకు నచ్చినట్లుగా ఆనందంగా, జల్సాగా అనుభవించిన నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.
జీర్ణించుకోలేని నెల్లూరు
నెల్లూరులో అంతా తానై తిరుగుతూ ఎప్పుడూ ప్రజల్లో ఉండే ఆనం ఇక లేరని అంటే అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారి ఆయన పార్థీవ దేహాన్ని చూసి కన్నీటిపర్యాంతమవుతున్నారు. నెల్లూరు జిల్లాలోనే గాక, తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాగా, గురువారం ఆనం వివేక పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు హాజరై నివాళులర్పించనున్నారు. ఆనం మృతి పట్ల సీఎం చంద్రబాబుతోపాటు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర పార్టీల నేతలు, మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.