చాలా ఆడా: హిజ్రాలతో ఆనం హల్చల్, ఎంపి పైకి బాటిల్
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఎప్పుడు తన చేష్టలతో వార్తల్లో నానుతుంటారు. గురువారం నెల్లూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెబుతుండగా అక్కడకు హిజ్రాలు వచ్చారు.
ఈ సమయంలో ఆనం వారితో కాసేపు మాట్లాడారు. తమతో ఆడాలని హిజ్రాలు ఆనంను కోరారు. అందుకు ఆనం స్పందిస్తూ.. తాను చాలా ఆడాను లెండీ అంటూ వారిని అక్కడి నుండి పంపించారు. వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ కాసేపు హల్ చల్ చేశారు. కాగా, ఆనం వివేకా ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో సిగరేట్ తాగిన విషయం తెలిసిందే.
చింతామోహన్ పై వాటర్ బాటిల్
పలు జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. గురువారం తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతా మోహన్ రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సమయంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆయన పైకి వాటర్ బాటిల్ విసిరేశారు. దీంతో రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది.
కాగా, ఖమ్మం జిల్లా కొత్తగూడెం రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెసు, సిపిఐ కార్యకర్తలు కొట్టుకొని, పరస్పరం కుర్చీలు విసురుకున్న విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆందోళన చేశారు.