'టీడీపీలో చేరి తప్పుచేశాను': బాబు ఆ మాట అనడంతో భంగపడ్డ ఆనం..
ఎమ్మెల్సీ టికెట్ కావాలని సీఎం వద్ద ఆనం ప్రస్తావించగా.. ఏమివ్వాలో నాకు తెలుసని చంద్రబాబు బదులివ్వడంతో ఆనం వివేకానందరెడ్డి అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది.
నెల్లూరు: కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్నాళ్లు నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం బ్రదర్స్.. టీడీపీలోకి మకాం మార్చాక ఆ స్థాయిలో రాజకీయాలు చేయలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఫ్యామిలీ పాలిటిక్స్ తో నెల్లూరు రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పాలని వారు భావిస్తున్నా.. అధినేత చంద్రబాబు మాత్రం వారిని దూరం పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా రెండు రోజుల అమరావతి పర్యటనలో చంద్రబాబును కలిసే అపాయింట్ మెంట్ దక్కించుకున్న ఆనం.. టీడీపీ తరుపున పొలిటికల్ బెర్త్ మాత్రం దక్కించుకోలేకపోయారట. ఎమ్మెల్సీ టికెట్ కావాలని సీఎం వద్ద ఆయన ప్రస్తావించగా.. ఏమివ్వాలో నాకు తెలుసని చంద్రబాబు బదులివ్వడంతో ఆనం వివేకానందరెడ్డి అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది.
అనవసరంగా టీడీపీలో చేరాం: ఆనం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో తనకు టికెట్ దక్కుతుందనుకున్న ఆనంకు సీఎం ఝలక్ ఇవ్వడంతో.. టీడీపీలో అనవసరంగా చేరామని ఆయన తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం.
అంతేకాదు సీఎం చంద్రబాబే ఆనంకు క్లాస్ తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీకే నష్టం వాటిల్లేలా చేస్తున్నారని సీఎం ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారట.
రామనారాయణరెడ్డికి ఓకె.. తమ పరిస్థితేంటి?
పార్టీలో చేరేముందు టీడీపీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నెల్లూరు రాజకీయాల్లో మరోసారి తమదే ఆధిపత్యం అని ఆనం బ్రదర్స్ భావించారు. కాగా, ఒప్పందంలో భాగంగా ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే సీటు ఇస్తామని అధిష్టానం హామి ఇచ్చింది.
ఆ మేరకు ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ చార్జీగా రామనారాయణరెడ్డిని నియమించారు. రామనారాయణరెడ్డి వరకు బాగానే ఉన్నా.. తనను, తన కొడుకును మాత్రం టీడీపీ పట్టించుకోవట్లేదన్న అసహనం ఆనం వివేకానందరెడ్డిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
తనయుడికి ఎమ్మెల్యే టికెట్ ఆశించి:
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఆశించిన ఆనం వివేకానందరెడ్డి.. తనయుడికి ఎలాగైనా ఎమ్మెల్యే సీటు దక్కేలా చేయాలనుకున్నారు. కానీ అధినేత చంద్రబాబు అందుకు ప్రతికూలంగా స్పందించడంతో ఆయన ఊహలు తలకిందులయ్యాయని చెప్పుకుంటున్నారు.
రెండు రోజులు విజయవాడలో మకాం వేసి మరీ అధినేతను కలవడానికి ప్రయత్నిస్తే.. చివరికి 2నిమిషాలు మాత్రమే కేటాయించారు చంద్రబాబు. ఈ సందర్బంగా తనకు ఎమ్మెల్సీ, తనయుడికి ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆనం చంద్రబాబును కోరగా.. ఏమివ్వాలో తనకు తెలుసునని చంద్రబాబు సింగిల్ లైన్ లో తేల్చేశారట. దీంతో ఆనం ఢీలా పడిపోయారన్న చర్చ జరుగుతోంది.
ఎప్పుడూ లేనిది కంటతడి పెట్టిన ఆనం:
ఆనం వివేకానంద అంటేనే వ్యంగ్య వ్యాఖ్యలకు పెట్టింది పేరు. ఎప్పుడు ఒకరిపై విమర్శలు చేయడమే తప్పించి డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేయరు. అలాంటి ఆనం మీడియా సమావేశంలో కంటతడి పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
తన తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డితో చిచ్చుపెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఏదేమైనా చివరి వరకు తాము రాజకీయాల్లో కొనసాగుతామని అన్నారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులపై కూడా ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.