హరిజనవాడలకు మహనీయుల పేర్లు: అనంతపురంలో వినూత్న ప్రయోగం: అదే బాటలో మహారాష్ట్ర
అనంతపురం: అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం ఓ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. కులాలను ప్రతిబింబించే పేర్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాటి స్థానంలో మహనీయుల పేర్లను పెడుతోంది. కొన్ని సంవత్సరాల పాటు హరిజన, గిరిజనవాడలుగా దళిత, నిమ్న వర్గాల కులాన్ని ప్రతిఫలింపజేస్తూ వచ్చిన ప్రాంతాల పేర్లను తొలగించడం, వాటి స్థానంలో జాతీయ నాయకుల పేర్లను పెట్టటం పట్ల జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. సామాజిక దురాచారాన్ని తొలగించేలా చేస్తోన్న ప్రయత్నాలను జిల్లావాసులు స్వాగతిస్తున్నారు.
Recommended Video
హరిజనవాడలు కనిపించవ్..
అనేక గ్రామాల్లో ఇప్పటికీ హరిజనవాడలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాలను హరిజనవాడలుగా పిలుస్తూ వస్తున్నారు. కిలోమీటర్లను సూచించే రాళ్ల మీద కూడా వాటిని రాసిన సంఘటనలు వందల్లో ఉంటున్నాయి. దీన్ని సామాజిక దురాచారంగా భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. అలాంటి పేర్లను తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన ఓ సర్కులర్ను జారీ చేశారు. హరిజన వాడ/గిరిజనవాడ/దళిత వాడలకు మహనీయుల పేర్లను పెట్టాలని సూచిస్తూ జిల్లాలోని అన్ని తహశీల్దార్లకు ఆదేశాలను ఇచ్చారు.
480 ప్రాంతాలకు పేర్లను మార్చేలా
ఈ ఆదేశాల అనంతరం జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుంది. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, లాక్డౌన్ను విధించడం వంటి పరిణామాలు ఎదురు కావడంతో దీనికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుమారు తొమ్మిది నెలల తరువాత పరిస్థితులు మళ్లీ అనుకూలించడంతో హరిజన వాడల పేర్లను మార్చే దిశగా అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. తక్షణ చర్యలను చేపట్టింది. జిల్లావ్యాప్తంగా హరిజన/గిరిజన/దళితవాడలు 480 వరకు ఉన్నట్లు గుర్తించింది. దశలవారీగా కులాన్ని ప్రతిబింబించే పేర్లను తొలగించడాన్ని చేపట్టింది.
మహనీయుల పేర్లతో..
ఆయా ప్రాంతాలకు మహనీయుల పేర్లను పెట్టే కార్యక్రామన్ని చేపట్టింది. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మదర్ థెరీసా, గౌతమబుద్ధుడు వంటి నేతల పేర్లను పెడుతోంది. ఇప్పటికే వందకు పైగా హరిజనవాడలకు మహాత్మగాంధీ, బీఆర్ అంబేద్కర్ వంటి నేతల పేర్లను పెట్టినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
ఆధునిక కాలంలోనూ సామాజిక దురాచారం
స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేళ్ల తరువాత కూడా గ్రామాల్లో కుల వివక్ష, సామాజిక దురాచారం ఇంకా కొనసాగుతోందనడానికి గుర్తుగా హరిజనవాడలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. నిమ్న కులాలకు చెందిన వారు గ్రామాల బయటే నివసిస్తున్నారనడానికి నిదర్శనంగా హరిజనవాడలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయని, వాటికి స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల పేర్లను పెట్టడం వల్ల క్రమంగా స్థానికులు వారిపట్ల భేదభావం చూపరని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా..
ఇదే విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని నిర్ణయించుకుంది. ఏపీలో ఒక్క అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ విధానాన్ని రాష్ట్రమంతటా విస్తరింపజేయాలని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం భావిస్తోంది. ఒక కులాన్ని సూచించేలా ఏర్పాటు చేసిన ప్రాంతాల పేర్లను బదలాయిస్తామని మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ధనంజయ్ ముండే తెలిపారు. దీనిపై కొద్దిరోజుల కిందటే ఆయన ఓ ప్రకటన చేశారు. దశలవారీగా హరిజన/గిరజన/దళిత వాడల పేర్లను తొలగిస్తామని, వాటి స్థానంలో స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెడతామని పేర్కొన్నారు.