నోట్ల రద్దు, ఉద్యోగిని చితక్కొట్టిన పోలీసులు: వీడియో హల్చల్, ఆ రోజు ఏం జరిగింది?
ఈ నెల 13వ తేదీన అనంతపురం జిల్లాలో ఓ ఉద్యోగి పైన పోలీసులు చేయి చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఇటీవల బ్యాంక్ వద్ద ఓ వ్యక్తిని పోలీసులు కొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ సృష్టిస్తోంది. ఓ ఎస్సై, పోలీసులు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టిన వీడియో అది.
ఈ నెల 13వ తేదీన సాయి నగర్ స్టేట్ బ్యాంకు వద్దకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పైన పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు పైన సోషల్ మీడియాలో నిరసన వ్యక్తమవుతోంది. దీంతో అసలు ఆ రోజు ఏమైందనే చర్చ జరుగుతోంది.
కడప జిల్లా కమలాపురంకు చెందిన మాధవ రెడ్డి స్థానిక ఎస్కేయూ క్యాంపస్లో భారత వాతావరణ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ విభాగంలో పని చేస్తున్నారు. కేంద్రం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయన డబ్బుల కోసం తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో 13వ తేదీన సాయి నగర్ స్టేట్ బ్యాంకు వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఎస్సై జనార్ధన్ అనుచితంగా మాట్లాడటంతో మాధవ్ కోపోద్రిక్తుడయ్యారని తెలుస్తోంది. అతను ఎస్సై పైన చేయి చేసుకోవడం, ఆ తర్వాత అతనిని పోలీసులు గొడ్డును బాదినట్లు బాదడం జరిగిందని అంటున్నారు.
సోషల్ మీడియాలో ఇలా హల్చల్ చేస్తోంది..
ఒక పౌరుడు.. పది మంది పోలీసులు.. ఓ ఎస్సై అతన్ని బూతు పదాలతో తిట్టడంతో తిరిగి అతను మాట్లాడినందుకు.. పది మంది పోలీసులు చుట్టుముట్టి.. కొట్టి.. ఈడ్చుకెళుతూ.. కాళ్లతో తన్ని.. ఒంట్లో ఉన్న సత్తువంతా కూడగట్టి లాఠీలతో చితకబాది.. అరుస్తున్నా బలవంతంగా జీపులో ఎక్కిస్తున్న వీడియోలు వాట్సాప్, ఫేస్బుక్లలో హల్చల్ చేస్తున్నాయి.
అనంతపురం నగరంలో జరిగిన ఈ సంఘటన నెటిజన్లకు చర్చనీయాంశంగా మారింది. ఈ క్లిప్పింగ్పై రకరకాలు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఈ సంఘటన సీరియస్గా మారింది. ఇది అమానుష దృశ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చివరకు రాష్ట్ర స్థాయి పోలీసులు కూడా స్పందించారు.
జిల్లా పోలీసు అధికారులను విచారణకు ఆదేశించారు. దీంతో స్వయంగా అనంతపురం ఎస్పీ రాజశేఖరబాబు బాధితుడి వద్దకు వెళ్లి విచారించారు.
ఏం జరిగిందంటే..?
నోట్ల రద్దుపై ఈనెల 13వ తేదీన పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అనంతపురం నగరంలోని సాయినగర్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీ నిర్ణయాన్ని తప్పుబడుతూ సామాన్యుల కష్టాలపై ఆయన మాట్లాడుతున్నారు. అదే బ్యాంకు వద్ద ప్రజలు భారీగా నగదు కోసం క్యూకట్టి ఉన్నారు.
బాధితులు, స్థానికుల వివరాల మేరకు.. అదే సమయంలో మాధవరెడ్డి హెల్మెట్ ధరించి తన మోటారు బైకులో అక్కడికొచ్చారు. పక్కనే బైకు ఆపాడు. దీన్ని గమనించిన అక్కడున్న ఎస్సై.. మాధవ రెడ్డిని బైకు అక్కణ్నుంచి తీయాలని చెప్పారు. వినకుండా అతను డబ్బు కోసమో, రఘువీరా రెడ్డి ప్రసంగం వినడం కోసమో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై ఆ ఉద్యోగిని తిట్టాడని తెలుస్తోంది.
మాధవరెడ్డి తిరిగి మాట్లాడాడు. దీంతో ఆ ఎస్సై.. మాధవరెడ్డిపై చేయి చేసుకోబోయాడు. వెంటనే అతను చేయి అడ్డం పెట్టాడని తెలుస్తోంది. ఎస్సైని కొట్టినట్లుగా ప్రచారం జరిగిందని అంటున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులు గుమికూడి మాధవ రెడ్డిని పట్టుకున్నారు. అతనిని కొట్టారు. ఓ అధికారి అతనిని చేతిలోని లాఠీతో తీవ్రంగా చితకబాది, కాలితో తన్నుతుండగా.. మిగతా పోలీసులు అతనిని జీపు వద్దకు తీసుకెళ్లారు.
మాధవ రెడ్డి దెబ్బలకు తట్టుకోలేక ఆర్తనాదాలు పెడుతున్నా జీపులో ఎక్కించుకొని స్టేషనుకు తీసుకెళ్లారు. ఆయన భార్య భార్గవిని కూడా కలవనీయలేదు. అనంతరం భార్య అతనిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించింది. ప్రస్తుతం మాధవ రెడ్డి శరీరానికి కట్లు కట్టించుకుని అనంతపురం ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నాడు. మరోవైపు, మాధవ రెడ్డిని లాఠీతో కొట్టిన అధికారిని గురువారం సాయంత్రం వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు పంపారు.