సినీ ఫక్కీలో బురఖాల్లో వచ్చి డాక్టర్ కిడ్నాప్- అనంతపూర్ పోలీసుల మెరుపుదాడితో..
హైదరాబాద్లో కిడ్నాప్కు గురైన ఓ దంత వైద్యుడిని కిడ్నాపర్లు బెంగళూరు తరలిస్తుండగా.. ఏపీలోని అనంతపురం జిల్లా పోలీసులు చాకచక్యంగా వల పన్ని పట్టుకున్నారు. అతడిని కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి కల్పించారు. సకాలంలో స్పందించడం ద్వారా కిడ్నాపర్ల వ్యూహాన్ని విఫలం చేసిన అనంతపురం పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
హైదరాబాద్లోని కిస్మత్ పూర్లో డెంటల్ డాక్టర్ గా పనిచేస్తున్న హుస్సేన్ను నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొందరు కిడ్నాప్ చేశారు. బుర్ఖాల్లో వచ్చిన ఐదుగురు హుస్సేన్ను ఎత్తుకుపోయారు. హైదరాబాద్లోని గుర్తు తెలియని ప్రాంతంలో ఆయన్ను దాచిపెట్టారు. మరాఠీలో మాట్లాడుతున్న కిడ్నాపర్లు ఆ తర్వాత కాసేపటికే బొలెరో వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తుల ముఠాకు హుస్సేన్ను అప్పగించారు. ఆయన్ను బెంగళూరు మీదుగా షిమోగా తరలించాలని వారికి చెప్పారు.
అక్కడి వరకూ బాగానే సాగినా ఆ తర్వాత కిడ్నాపర్లు బాధితుడి కుటుంబాన్ని 10 కోట్లు బిట్ కాయిన్ల రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు చేసిన సెల్ఫోన్ కాల్స్ ఆధారంగా ఆచూకీ గుర్తించిన హైదరాబాద్ పోలీసులు బాధితుడు హుస్సేన్ను అనంతపురం మీదుగా బెంగళూరు తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు.
వెంటనే అనంతపురం పోలీసులను అప్రమత్తం చేశారు. వారు కూడా వెంటనే స్పందీంచారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని దారులను అష్టదిగ్బంధం చేశారు. చివరికి ఓ రూట్లో వెళ్తున్న బొలేరోను ఆపి కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు దొరికిపోగా.. మరో ముగ్గురు పారిపోయారు. వాహనంలో కాళ్లూ, చేతులు కట్టేసి ఉన్న డాక్టర్ హుస్సేన్ను విడిపించి హైదరాబాద్కు పంపారు.
బాథితుడు హుస్సేన్ డెంటల్ డాక్టర్గా ఉంటూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కిస్మత్పూర్లో ప్రెస్టేజ్ రాయల్ వుడ్స్ పేరుతో ఆయనకు విల్లాలు ఉన్నట్లు కనుగొన్నారు. వ్యాపార సమస్యల కారణంగానే ప్రత్యర్ధులు ఆయన కిడ్నాప్కు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దొరికిన నిందితుడిని విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులు త్వరలో వివరాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు.