జేసీ దివాకర్రెడ్డి అరెస్ట్: వైసీపీ నేతలు బండలు పాతారు: వెంకటాపురం లో టెన్షన్..!
మాజీ ఎంపీ దివాకర్ రెడ్డితో సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్నటీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ కార్యకర్తల మధ్య వెంకటాపురం గ్రామంలో ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి తన స్థలం హద్దుల్లో బండలు పాతారు. అయితే, తన ఇంటి ముందు వైసీపీ నేతలు బండలు పాతారంటూ టీడీపీ కార్యకర్త నాగరాజు ఆరోపిస్తున్నారు. దీని మీద కొద్ది రోజులుగా వివాదం సాగుతోంది.
చంద్రబాబుని జైలుకు పంపే ప్రయత్నాల్లో జగన్ ... జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
దీని పైన దీనిపై నిజానిజాల నిర్ధారణకు టీడీపీ నేతలు వెంకటాపురం బయల్దేరారు. అనంతపురం మాజీ ఎంపీ దివాకర్ రెడ్డితో పాటుగా బీటీ నాయుడు..శింగమనల మాజీ ఎమ్మెల్యే యామినీ బాల అక్కడకు బయల్దేరారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందుగానే వారిని అరెస్ట్ చేసారు. దీంతో.. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుల తీరును డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
తన స్థలంలో వైసీపీ కార్యకర్తలు బండలు పాతారని టీడీపీ శ్రేణులు..కాదు వైసీపీ కార్యకర్త స్థలంలోనే బండలు పాతుకున్నారని వైసీపీ శ్రేణులు పరస్పరం వాదించుకుంటున్నాయి. ఈ వ్యవహారం జిల్లా స్థాయి నేతల దాకా వెళ్లటంతో అక్కడకు వెళ్లి కార్యకర్తలకు మద్దతుగా నిలవాలని జిల్లా టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలే స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ స్థలంలో రహదారి ఉందంటూ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. యితే వెంకట్రామిరెడ్డి సొంత స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్థారణ చేశారు.
మరోవైపు టీడీపీ నేతల తీరుపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. టీడీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం మరింతగా ముదిరితే అక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని భావించిన పోలీసులు రెండు పార్టీల నేతలను నియంత్రించారు. అరెస్ట్ చేసిన మాజీ ఎంపీ దివాకర్ రెడ్డితో సహా ఇతర నేతలను కాసేపటితో వారి నివాసాల వద్ద వదిలేసారు. వెంకటాపురంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ముందస్తుగా పోలీసు బలగాలను మొహరించారు.