అనంతలో టీడీపీకి షాక్: ఇద్దరు నేతల గుడ్ బై: నేడు జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
అనంతపురం: వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కడప .. ప్రకాశం జిల్లాల నుండి ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ నుండి వైసీపీలో చేరారు. ఇక, ఇప్పుడు అనంతపురం శింగనమల నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీలో చేరనున్నారు. ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశాలున్నాయని సమచారం.
ఇప్పటికే పార్టీ అనుచరులతో కలిసి విజయవాడ చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల గత కొన్ని రోజులుగా టీడీపీని వీడుతారని ప్రచారం జరిగింది. అందుకే మూడు రాజధానుల బిల్లుపై ఓటింగ్ సమయంలో శమంతకమణి శాసనమండలికి గైర్హాజరయ్యారు. అప్పటి నుంచే శమంతకమణి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా వైసీపీ నుంచి పిలుపురావడంతో శమంతకమణితో పాటు యామినీ బాల కూడా వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.
ఎమ్మెల్సీగా ఉన్న శమంతకణి.. ఆమె కుమార్తె యామినీ బాల వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. జనవరిలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లుల సమయంలోనే శమంతకమణి టీడీపీ సమావేశానికి గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. అయితే, ఆ సమయంలో వైసీపీ నేతలతో మంతనాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. శమంతకమణి తొలిగా కాంగ్రెస్ నుండి 1985లో పోటీ చేసి ఓడారు. తిరిగి 1989లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన శమంతకమణి కాంగ్రెస్ అభ్యర్ధి ..ప్రస్తుత పీసీసీ చీఫ్ శైలజానాద్ చేతిలో ఓడిపోయారు.
Recommended Video
ఇక, 2014 ఎన్నికల్లో శమంతకమణి కుమార్తె యామినీ బాల టీడీపీ నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి జొన్నలగడ్డ పద్మావతి పైన గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వంలో విప్ గా పని చేసారు. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి జొన్నలగడ్డ పద్మావతి అక్కడ నుండి యామినీ బాల మీద గెలుపొందారు. అయితే, కొద్ది రోజులుగా వారు టీడీపీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నాలుగు రోజులుగా వారిద్దరూ తమ అనుచరులతో మంతనాలు సాగించారు. వారు సైతం వైసీపీలో చేరాలని సూచించారు. దీంతో.. వారు వైసీపీలో చేరాలని నిర్ణయించారు.