కులాల మద్య చిచ్చు, వర్మ ఓ సైకో: ప్రభాకర్ చౌదరి
అనంతపురం:లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రామ్గోపాల్ వర్మ చేస్తున్న ప్రయత్నాలపై మరో టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కులాల మధ్య వర్మ చిచ్చుపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ ఓ సైకో అని అన్నారు. ఈజీ మనీ కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ సినిమాలు తీస్తున్నారని దుమ్మెత్తిపోశారు. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నిర్మాతలతో కలిసి సినిమా నిర్మిస్తే ఊరుకోబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథాంశం ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టైటిల్తో సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారం సృష్టిస్తోంది.
ఈ సినిమా తీయడంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలో ఏమైనా తేడా వస్తే... అంటూ టీడీపీ నేతలు రాంగోపాల్ వర్మను తీవ్రంగా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.