'కాల్వ'కు అనంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల షాక్: పదవి చేపట్టిన వేళ వారంత దూరంగా..
'కాల్వ'కు అనంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల షాక్: పదవి చేపట్టిన వేళ వారంత దూరంగా..
అనంతపురం: అనంత పాలిటిక్స్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. పరిటాల వర్గం, పయ్యావుల వర్గం, జేసీ వర్గం.. ఎవరి గ్రూపు రాజకీయాలు వారివే. అంతా ఒకే గూటిలో ఉన్నా.. అంతర్గతంగా వీరి మధ్య ఎప్పుడూ విభేదాలు ఉంటూనే ఉంటాయి. తాజాగా ఆ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
అనంతపురం జిల్లా రాయదర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. వీరిలో పరిటాల సునీత మినహా మిగతా వారంతా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, బీకే పార్థసారథి, యామినీ బాల, వరదాపురం సూరిలు హాజరు కాలేదు.
మంత్రి పదవి కోసం శతవిధాలా ప్రయత్నించిన పయ్యావుల, పార్థసారథిలు అధినేత నిర్ణయంతో అసంతృప్తికి లోనై, ఆ కారణంగానే కార్యక్రమానికి దూరంగా ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి రాకపోవడంతో కాల్వ శ్రీనివాసులు ఒకింత షాక్ కు గురైనట్లు చెబుతున్నారు.
కాగా, ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న కాల్వ శ్రీనివాసులు ఏపీ సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖల మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు.