బాబూ! కెసిఆర్ను చూసైనా నేర్చుకో!: రవీంద్రనాథ్ రెడ్డి, బాబు సవాల్కు అనంత రెడీ
అనంతపురం: రాయలసీమ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చేసిన సవాల్కు అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటవెంకట్రామిరెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సీమకు జరిగిన అన్యాయంపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్దమని సోమవారం అనంతపురంలో మీడియాతో అన్నారు.
చంద్రబాబు ఎప్పుడు పిలిచినా తన వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధిపై చర్చకు రావాలని సోమవారం కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సవాల్పై అనంత వెంకట్రామిరెడ్డి స్పందించారు. చంద్రబాబు విధానాల వల్ల రాయలసీమ ఉనికికే అన్యాయం జరిగిందన్నారు.
ఆర్టీసీని ఏవిధంగా పరిరక్షించాలో అనే విషయాన్ని తెలుసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును చూసి నేర్చుకోవాలని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చంద్రబాబుకు సూచించారు. ఏపీఎస్ఆర్టీసీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ స్థాపించే విషయంపై సోమవారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు.
పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 43శాతం పెంచడంతోపాటు సంస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నారని రవీంద్రనాథ్ రెడ్డి వివరించారు. ఏపీలో జీతాల పెంపుదలకోసం కార్మికులు సమ్మెబాట పట్టినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదనీ, ఎనిమిది రోజుల ఆందోళనల తర్వాత కార్మికులకు విపక్ష నేత వైఎస్ జగన్ అండగా రంగంలోకి దిగడంతో ఏపీ ప్రభుత్వం స్పందించిందని అన్నారు. జీతాలను 43 శాతం పెంచుతామని కూడా ప్రకటించారని, అయితే జీవో విడుదల చేయలేదని విమర్శించారు.
ఏపీఎస్ఆర్టీసీని దివాళా తీయించి ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని, ఉద్యోగుల ఉసురు పోసుకొంటున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రవీంద్రనాథరెడ్డి తెలిపారు.