కాంగ్రెస్లోనే ఎంపీ అనంత, జగన్ను కల్సిన హర్షకుమార్
హైదరాబాద్: అనంతపురం కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి కాంగ్రెసు పార్టీలోనే కొనసాగనున్నారు. సమైక్యాంధ్ర కోసం అధిష్టానం పైన ఒత్తిడి పెంచే క్రమంలో అనంత లోకసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అనంతరం ఆయన కొద్ది రోజుల క్రితం సమైక్యాంధ్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. దీంతో ఆయన జగన్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అనంత కూడా జగన్ను కలిసిన అనంతరం మాట్లాడారు.
సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నది జగన్ ఒక్కరేనని ప్రశంసించారు. అందుకే ఆయన దీక్షకు మద్ధతు తెలుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడుగా వెళుతోందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను, తమను మోసం చేసిందని మండిపడ్డారు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చాకే ముందుకు వెళతామని చెప్పి, తర్వాత మాట తప్పిందని ధ్వజమెత్తారు. మంత్రుల కమిటీలోనూ అన్యాయమే చేశారని రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మంత్రినీ ఇందులో నియమించలేదని విమర్శించారు.
అంతేకాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు చేరతానో త్వరలో చెబుతానని ఆయన వ్యాఖ్యానించినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. వాటిని ఆయన కొట్టి పారేశారు. తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని మీడియాలో చెప్పారు. అయినప్పటికీ ఆయన జగన్ వైపు వెళ్తారనే ప్రచారం సాగింది. అయితే తన వర్గీయుల ఒత్తిడి మేరకు ఆయన కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయించుకున్నారట.
జగన్ను కల్సిన హర్షకుమార్
అమలాపురం ఎంపి హర్ష కుమార్ మంగళవారం వైయస్ జగన్ను కలిశారు. తన ఇంట్లో జరిగే ఓ వేడుకకు ఆయన జగన్ను ఆహ్వానించారు.