అనంతపురం ఎఫెక్ట్ ... చిత్తూరు జిల్లాలో అలెర్ట్ .. 13 మంది తహసీల్దార్లకు కరోనా టెస్టులు
ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజా బులిటెన్ ప్రకారం మొత్తం ఇప్పటి వరకు 525 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటికే పలు జిల్లాలలో రెడ్ జోన్లు ప్రకటించి ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు. ఇక అంతే కాదు మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించనున్నారు. కొన్ని ప్రాంతాలలో నో మూమెంట్ జోన్లుగా ప్రకటించి నిత్యావసరాలు కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు . గుంటూరు, కృష్ణా జిల్లాలలో రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అనంత తహసీల్దార్ కు కరోనా పాజిటివ్ రావటంతో కరోనా ప్రభావిత జిల్లాల్లో అలెర్ట్ అయ్యారు.
లోకల్ ట్రాన్స్మిషన్ తో తహసీల్దార్ కు కరోనా పాజిటివ్
ఇప్పటి వరకు ఏపీలో నమోదైన 525 కరోనా పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం 491 మంది చికిత్స పొందుతున్నారు. ఇక అనంతపురం జిల్లాలో ఒక తహసీల్దార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వటం కలకలం రేపుతుంది. అనంతపురం జిల్లా హిందూపురంలో నివాసం ఉంటున్న ఒక తహసీల్దార్ కుహిందూపురంలో లోకల్ ట్రాన్స్మిషన్ వల్ల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఆయనను కలిసిన వారిని, ఆయనతో మాట్లాడిన క్షేత్ర స్థాయి సిబ్బంది అందరినీ క్వారంటైన్ కు పంపి వారిని పరీక్షిస్తున్నారు .
అప్రమత్తమైన చిత్తూరు అధికార యంత్రాంగం
అనంత పురం జిల్లా ఎఫెక్ట్ చిత్తూరు జిల్లా మీద పడింది . ఇదే సమయంలో చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది . కరోనాని అరికట్టడానికి అధికారులు కుడా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నిలకడగానే ఉన్నాయి. ఇప్పటి వరకూ జిల్లాలో 1944 మంది శాంపిల్స్ సేకరించగా.. 1051 మందికి నెగటివ్ అని తేలినట్టుగా తెలుస్తుంది . అయితే జిల్లాలో మెత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 23 . కరోనా పాజిటివ్ నుంచి ఒకరు రికవరీ కావడంతో ప్రస్తుతం ఐసోలేటెడ్ వార్డ్లో 22 మంది ఉన్నారు.
13 మంది తహశీల్దార్లు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆదేశం
ఇక చిత్తూరు జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో 13 మంది తహశీల్దార్లు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రం విడుదల చేసిన హాట్స్పాట్ ప్రాంతాల జాబితాలో చిత్తూరు జిల్లా కూడా ఉండటంతో పాటు అనంతలో తహసీల్దార్ కు సోకటంతో అప్రమత్తపై ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించుకోమని చెప్పారు. చిత్తూరు జిల్లాలోని రెడ్జోన్ల పరిధిలో ఉన్న తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, వడమాలపేట, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, నారాయణవనం, పలమనేరు తహశీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.