రాజధాని గ్రామాల్లో అరాచక శక్తులు .. పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. స్థానికుల ఆగ్రహం
వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు, రేపు కూడా కొనసాగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రకటిస్తూ తీర్మానం చెయ్యటం ఆ బిల్లు శాసన సభ్యులు ఆమోదించటం జరిగింది.దీంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ నేపధ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. అరాచక శక్తులు ప్రవేశించాయన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు.
ఈ రోజు ఏపీకి బ్లాక్ డే.. కర్ఫ్యూ లా ఉంది .. ఇది పిరికిపంద చర్య ... చంద్రబాబు
అరాచక శక్తులు ప్రవేశించాయని ఇంటెలిజెన్స్ సమాచారం
గుంటూరు జిల్లా వెలగపూడిలో ఉన్న ఏపీ సచివాలయం పరిసర ప్రాంతాలతో పాటు, అమరావతి పరిధిలోని గ్రామాల్లోకి అరాచక శక్తులు ప్రవేశించాయని పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. ఇక ఈ నేపధ్యంలో ఈ ఉదయం నుంచి భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. రాజధాని సమీప గ్రామాలన్నింటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని, ఎటువంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని చెప్తున్నారు.
ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని 29 గ్రామాల్లో మైకుల్లో ప్రచారం
ఎవరు ఎలాంటి స్టెప్ తీసుకున్నా పరిణామాలు దారుణంగా ఉంటాయని 29 గ్రామాల్లో పోలీసులు మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరిస్తున్నారు .ఎవరైనా పోలీసుల సూచనలు లక్ష్యపెట్టకుండా అటువంటి పనులు చేస్తే, కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరికీ ఆశ్రయం కల్పించవద్దని స్థానికులకు సూచిస్తున్న పోలీసులు, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
అసెంబ్లీ రోడ్లన్నీ బ్లాక్ చేసిన పోలీసులు .. పరిస్థితిని సమీక్షిస్తున్న ఉన్నతాధికారులు
ఇక అంతే కాదు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు సభలో ఆమోదం పొందిన నేపధ్యంలో అమరావతి ప్రాంత వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది .ఇక ఈ నేపధ్యంలో రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పటికే అసెంబ్లీకి దారితీసే అన్ని రోడ్లనూ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరైనా నిరసనలు తెలియజేయాలని భావిస్తే, శాంతియుతంగా చేసుకోవచ్చని, ర్యాలీలను మాత్రం అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల తీరుపై రాజధాని ప్రాంత వాసుల ఆగ్రహం
కావాలని పోలీసులు సోదాలు చేస్తూ , భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి గ్రామాల ప్రజలు. శాంతియుతంగా ఆందోళనలు సైతం చేసుకోనీకుండా తమను వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై, ప్రభుత్వ వైఖరిపై వారు నిప్పులు చెరుగుతున్నారు.