భూకబ్జాలు, గ్రామాల్లో అరాచకాలు ఆపాలని హితవు ..వైసీపీపై కన్నా ఫైర్
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు. ఏపీలో బీజేపీ పుంజుకుంది అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుందని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని నిప్పులు చెరిగారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా దాడులేనని ఆయన విమర్శలు గుప్పించారు.
వైసీపీ కార్యకర్తలపై నిప్పులు చెరిగిన కన్నా.. దాడులు హేయమని మండిపాటు
తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కన్నా లక్ష్మీ నారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ కార్యకర్తలపై నిప్పులు చెరిగారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి అరాచకాలకే పాల్పడిందని పేర్కొన్న కన్నా ఇప్పుడు వైసీపీ కూడా అదేబాటలో పయనిస్తోందని మండిపాటుకు గురయ్యారు . పద్దతి మార్చుకోకపోతే టీడీపీకి పట్టిన గతే పడుతోందని కన్నా హెచ్చరించారు. గతంలో టీడీపీ ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ఇప్పుడు వైసీపీ కూడా అలాగే అరాచకాలకు పాల్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు .
వైసీపీ కార్యకర్తల అరాచకం .. వైసీపీ నేతల భూ కబ్జాలు ఆపాలని హితవుపలికిన కన్నా
ఇక ఏపీ ప్రజలు మెచ్చి ఒక అవకాశం ఇచ్చారని, దాన్ని వైసీపీ నిలబెట్టుకోవాలని కన్నా హితవు పలికారు . వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తుంటే, వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఇక దీనిపై ఇప్పటివరకు వైసీపీ అధినేత సీఎం జగన్ మాట్లాడటం లేదని ఆయన ఫైర్ అయ్యారు. దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇదే తరహాలో ప్రవర్తించి ప్రజాగ్రహానికి గురైందని, ఇప్పుడదే బాటలో వైసీపీ ప్రభుత్వం కూడా నడుస్తోందని కన్నా విమర్శించారు. గతంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో రెండు మూడు గ్రామాల్లో వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డ సమయంలో కూడా ఘాటుగా స్పదించిన కన్నా ఇప్పుడు తిరుపతి వేదికగా వైసీపీపై మండిపడ్డారు.
వైసీపీ పై మాటల దాడి చేస్తున్న బీజేపీ నేత కన్నా ..వైసీపీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలనే యోచన
ఏపీలో జగన్ పాలన చేపట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రత్యర్ధి పార్టీల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది. ఇక వైసీపీపై బీజేపీ కూడా మాటల దాడి చేస్తుంది. ఆషాడం తర్వాత బీజేపీ తీర్ధం పుచ్చుకునే వారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యతవ నమోదు యుద్ధ ప్రాతిపదికన చేస్తుంది. భవిష్యత్ లో వైసీపీ కి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీనే ఉండాలని యత్నం చేస్తుంది.