నెల్లూరు:సముద్రంలో కొట్టుకొచ్చిన పురాతన శివలింగాలు,శాసనాలు...భక్తుల ఆనందాశ్చర్యాలు
నెల్లూరు:జిల్లాలోని ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లెపాళెం సముద్రతీరంలో రెండు పురాతనమైన శివలింగాలు వీటితో పాటు శిలా తోరణాలు, శాసనాలు కొట్టుకు రావడం సంచలనం గా మారింది.
గురువారం ఉదయం సముద్రానికి చేపల వేటకని వెళ్లిన జాలర్లకు పది అడుగుల దూరం నుంచి సముద్రపు నీటిలో ఏవో కొట్టుకు రావడం గమనించారు. తొలుత అవేమిటో అర్థం కాకపోవడంతో వాటికి ఎదురెళ్లి ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం అవి శివలింగాలు, శిలాతోరణాలు,శాసనాలుగా గుర్తించారు. ఈ విషయం తొలుత మత్స్యకారులు అధికారులకు సమాచారం ఇవ్వగా...వీఆర్వో ద్వారా ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు మధుసూదన్రావు సిబ్బందితో వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఇవి ఈ కాలం నాటివి కాదని, అతి పురాతనమైనవని...రాతితో చేసిన ఆ శివలింగాలని బట్టి గుర్తించారు. తదనంతరం నెల్లూరులోని ఆర్కియాలజి శాఖ వీటి గురించి సమాచారం ఇవ్వటంతో ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామసుబ్బారెడ్డి వీటిని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. శివలింగాలకు వినియోగించిన రాతిని బట్టి అవి పురాతనమైనవిగా ఆర్కియాలజీ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అలాగే మరో రాతి శాసనం శ్రీరాముడి జీవిత విశేషాలతో రూపొందించినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇవి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయో తెలుసుకోవాల్సి ఉందన్నారు. వీటిపై కలెక్టర్కు కూడా నివేదిక ఇస్తామని తహసీల్దారు మధుసూదన్రావు తెలిపారు. మరోవైపు శివలింగాలు, రాతి శాసనాలు సముద్రంలో కొట్టుకువచ్చిన విషయం తెలిసి భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. వాటిని తమ గ్రామస్థులకు ఇస్తే గుడి కట్టి పూజించుకుంటామని అధికారులను కోరినట్లు తెలిసింది. అయితే అందుకు అధికారులు నిరాకరించినట్లు సమాచారం.
మరోవైపు ఈ పురాతన శివలింగాలు, రాతి శాసనాలు సముద్రంలో కొట్టుకురావడంపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నించి తదనంతరం ఎదురైన పరిణామాలతో భయపడి సముద్రంలో పడేశారేమోననే కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ విగ్రహాలకు సంబంధించి విచారణ జరిపితే అన్ని విషయాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.