శ్రీశైలంలో బయటపడ్డ గుప్తనిధి: గుంత తవ్వుతుండగా.. అనూహ్యంగా!
50 పంచలోహ నాణెములు, 18 బంగారు నాణెములు, అర కిలోకి పైగా ఉన్న బంగారు కడియాలు,147 వెండి నాణెములు, ఒక కుంకుమ భరిణి బయటపడ్డాయి.
శ్రీశైలం: ఆలయ మరమ్మత్తుల్లో భాగంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో చేపట్టిన తవ్వకాల్లో ఓ గుప్తనిధి బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీశైలం మహాక్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణంలో భాగంగా గుడి వెనుక భాగంలో ఉన్న మఠంలో ఈ నిధి బయటపడింది.
మరమ్మత్తుల్లో భాగంగా కొంత లోతుగా గుంతలను తవ్వడంతో ఒక వెండి గిన్నె బయటపడింది. ఇందులో 50 పంచలోహ నాణెములు, 18 బంగారు నాణెములు, అర కిలోకి పైగా ఉన్న బంగారు కడియాలు,147 వెండి నాణెములు, ఒక కుంకుమ భరిణి ఉన్నాయి. దీంతో తవ్వకాల్లో బయటపడ్డ నిధి వివరాలను స్థానిక తహశీల్దారుకు తెలియపరిచారు.
అనంతరం పోలీసుల సమక్షంలో ఆలయ అధికారి ఒకరు నిధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం లభ్యమైన నిధి ఏ కాలానికి సంబంధించిందో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అదే సమయంలో తవ్వకాల్లో మరిన్ని నిధులు బయటపడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ అధికారులు తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు.