ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఇక అంతే, ఆస్తుల స్వాధీనం, నిరంతర నిఘా: చంద్రబాబు
అవినీతి వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకోనుంది.
అమరావతి: అవినీతి వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకోనుంది. వచ్చేనెల నుండి అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ నెలాఖరు వరకు అవినీతికి పాల్పడిన అధికారుల నుండి డబ్బులు వసూలు చేయనున్నారు.అవినీతి అధికారుల ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారు.
అవినీతికి పాల్పడే అధికారులపై ఇక రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకొనుంది.ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవినీతికి పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అవినీతికి పాల్పడితే వచ్చే నెల నుండి కఠినంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. అవినీతికి పాల్పడుతూ ప్రజలను ఇబ్బందిపెట్టే అధికారులు, ఉద్యోగులకు ఇక చుక్కలు చూపించనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఈ మేరకు ప్రత్యేకంగా ఓ కాల్ సెంటర్ ను కూడ ఏర్పాటుచేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని తగ్గించేందుకుగాను ఈ కాల్ సెంటర్ కు ప్రజలకు ఫిర్యాదు చేయనున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా ప్రజలనుండి ఫిర్యాదులు
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాల మేరకు అవినీతి అంశం ప్రధానంగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా కొందరు అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఆ ఫలాలు ప్రజలకు చేరడం లేదనే ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ అందింది.ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికడితే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందే అవకాశం ఉంటుందని సర్కార్ భావిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులు ఆస్తులు, లావాదేవీలపై ఆరా
అన్ని శాఖల్లో ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంలో చేతిరాతో నడిచే ఫైలు తీసివేసి కంప్యూటర్లోనే దానిని అన్ని స్థాయిలో నడిపిస్తారు. దీనివల్ల ఏ ఫైలు ఏ అధికారి వద్ద ఎన్ని రోజులు ఉందో ఇట్టే తెలిసిపోతోంది. ఇకపై అన్ని శాఖల్లో ఫైళ్ళ కదలికకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి..మరీ ఎక్కువ జాప్యం చేస్తున్న అధికారుల నుండి వివరణ కోరనున్నారు. దీని వల్ల ఫైళ్ళను పెండింగ్ పెట్టడం తగ్గిపోతోంది.తద్వారా అవినీతిని కూడ తగ్గించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
అక్రమార్కుల ఆస్తుల స్వాధీనం
అక్రమార్జనకు పాల్పడిన ఉద్యోగులు, అధికారుల ఆస్తుల స్వాధీనానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కూడ ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. పబ్లిక్ సర్వెంట్ల అక్రమాస్తుల స్వాధీనానికి ఇటీవల కొత్త చట్టం తెచ్చింది. గతంలో అవినీతి నిరోధక చట్టం కింద వీటిని స్వాధీనం చేసుకొనేవారు. కానీ, ఆ చట్టం బలహీనంగా ఉడడంతో పెద్దగా ఉపయోగపడడం లేదన్న అభిప్రాయంతో కొత్త చట్టం తెచ్చారు. దీని కింద ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫై చేసింది. త్వరలోనే వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. కొందరి ఆస్తులపైనా ఈ రకంగా స్వాధీనం చేసుకొంటే కొంత భయం వస్తుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.
ఉన్నతాధికారులపైనే దృష్టి
కిందిస్థాయి ఉద్యోగులపై కేంద్రీకరించకుండా ఉన్నతస్థాయిలోనే ఉన్నవారిపైనే కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేసింది. ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వానికి చెందిన పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కోట్లాది రూపాయాల ఆదాయం బయటపడుతోంది. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం నిజాయితీగా పనిచేస్తున్నవారి జోలికి వెళ్ళకూడదని సర్కార్ సూచించింది.అయితే వారు తప్పుచేస్తే వదలకూడదని కూడ హితవు పలికింది.
అవినీతి అధికారులపై 1100 నిఘా
రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అధికారులపై 1100 కాల్ సెంటర్ తో నిఘా ఏర్పాటు చేసింది. అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.ఇప్పటికే ఈ కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా లంచం ఇచ్చినవారికి డబ్బులను తిరిగి ఇచ్చేశారు. ఈ నెలాఖరువరకు మాత్రమే ప్రజల నుండి డబ్బులు తీసుకొన్న అధికారుల నుండి తిరిగి ప్రజల నుండి ఇప్పించనున్నారు. అయితే వచ్చే నెలలో మాత్రం అవినీతికి పాల్పడితే అధికారులను ఉపేక్షించబోమని చంద్రబాబునాయుడు హెచ్చరించారు.