సెక్షన్8 షాక్, ఆంధ్రా వారికి అధికారాల్లేవ్!: వేధిస్తున్నారని వీరరాఘవ
హైదరాబాద్/చిత్తూరు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని కోరినందుకు తనను వేధిస్తున్నారని ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేత వీర రాఘవ రెడ్డి సోమవారం నాడు ఆరోపించారు. తన కుమార్తెను జూబ్లీహిల్స్ స్కూల్ నుంచి తొలగించారన్నారు.
ఈ విషయమై వీర రాఘవ రెడ్డి సోమవారం గవర్నర్ సలహాదారులను కలిశారు. హైదరాబాదులో ఆంధ్ర అధికారులకు ఎటువంటి అధికారాలు లేవని గవర్నర్ సలహాదారులు చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధానిలో తమకు రక్షణ కరువైందని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.
హైదరాబాదులో అధికారాల పైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య కొద్ది రోజులుగా వాగ్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సెక్షన్ 8 వేడి తగ్గిపోయినప్పటికీ, మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాటల యుద్ధానికి దిగాయి.
సెక్షన్ 8 అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాయి. సెక్షన్ 8 గొడవ కేంద్రం వరకు వెళ్లింది. ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ తీరును ఏపీ మంత్రులు తప్పు పట్టారు.