'ఆంధ్ర' బాహుబలి చంద్రబాబు: ఆకాశానికెత్తిన తనికెళ్ల భరణి
రాజమండ్రి: సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆకాశానికెత్తారు. చంద్రబాబును ఆయన ఆంధ్ర బాహుబలిగా అభివర్ణించారు. రాజమండ్రిలో శుక్రవారం ఆంద్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతిపై ఏర్పాటైన సమావేశంలో పాల్గొనడానికి చంద్రబాబు వచ్చారు.
చంద్రబాబు వేదిక మీదికి వస్తుండగా తనికెళ్ల భరణి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చంద్రబాబును ఆంధ్ర బాహుబలిగా అభివర్ణించారు. 15 కోట్ల మందికి పైగా ఉన్న తెలుగు ప్రజలకు చంద్రబాబు బాహుబలి అని ఆయన అన్నారు. సినిమాలోని బాహుబలి కత్తితో పోరాటం చేయగా ఈ బాహుబలి చంద్రబాబు జ్ఞానంతో యుద్ధం చేస్తున్నారని అన్నారు.
భరణి మాటలు రిథమిక్గా సాగడంతో ఆయన ప్రసంగాన్ని నాయకులు, ఇతర అతిథులు, ప్రేక్షకులు తెగ ఆనందించారు. చంద్రబాబుతో పాటు అందరి ముఖాల్లోనూ నవ్వు విరబూసింది.
తనికెళ్ల భరణి తన ప్రసంగాన్ని ముగించగానే చంద్రబాబు మాట్లాడడం ప్రారంభించారు. బాహుబలి సినిమాను తాను చూశానని, చాలా బాగుందని ఆయన అన్నారు. రాజమౌళి అద్భుత ప్రతిభను ప్రదర్శించారని ఆయన కొనియాడారు.