837కోట్ల రుణం: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆస్తుల వేలం: ఆంధ్రా బ్యాంక్
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. .
రాయపాటి ఆస్తులు వేలం వేస్తున్నట్లు..
రూ. 837.37 కోట్ల విలువైన రుణ బకాయిలు చెల్లించనందున గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు సంబంధించిన ఆస్తులను మార్చి 23న వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. గుంటూరు అరండల్పేటలోని 22,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగివున్న వాణిజ్య భవనంతోపాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్ను వేలం వేస్తున్నట్లు పేర్కొంది.
వేలం వేసినా.. వ్యత్యాసమే ఎక్కువ..
కాగా, రుణానికి వేలం వేసే ఆస్తులకు మధ్య చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం. గుంటూరు భవనం ఆస్తి విలువను రూ. 16.44కోట్లు గానూ, ఢిల్లీలోని ఫ్లాట్ విలువను రూ. 1.09 కోట్లుగానూ నిర్ధారించినట్లు తెలిసింది. ఆంధ్రా బ్యాంక్ నుంచి ట్రాన్స్ట్రాయ్ ఇండియాతోపాటు చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగరావు, దేవికారాణి, లక్ష్మి పరిట రుణం తీసుకున్నారని తెలిపింది.
ఆంధ్రాబ్యాంక్ సైట్లో వివరాలు..
ఈ రుణానికి పూచీకత్తుగా రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్య చౌదరి, రంగారావు, దేవికా రాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, జగన్మోహన్ యలమంచలి ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఆంధ్రాబ్యాంక్ వెబ్సైట్ లేదా టెండర్స్ డాట్ జీపీవీ డాట్ ఇన్ను సంప్రదించాల్సిందిగా ఆంధ్రాబ్యాంక్ తన ప్రకటనలో వెల్లడించింది.
Recommended Video
ఇటీవల సుజనాకు కూడా ..
ఇది ఇలావుండగా, ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరికి కూడా బ్యాంకులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సుజనా గ్రూప్ రూ.400 కోట్లు రుణంగా తీసుకుని ఎగవేసినందున లోన్ డీఫాల్ట్ కిందకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా సుజనా గ్రూప్నకు సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు నోటీసులు ఇచ్చింది. ఇది సర్ఫేసీ(SARFAESI) చట్టం 2002 కింద బ్యాంకు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను రుణాలు తీసుకున్నవారికి, గ్యారెంటీ ఇచ్చినవారికి జారీ చేసింది.