బోటు ప్రమాదంపై బాబు ఇలా: సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలనం, గ్యారెంటీ ఇస్తారా అని బీజేపీ
విజయవాడ బోటు ప్రమాదంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం స్పందించారు. బోటుకు అనుమతి లేదనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడారు.
అమరావతి: విజయవాడ బోటు ప్రమాదంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం స్పందించారు. బోటుకు అనుమతి లేదనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడారు.
Recommended Video
ప్రమాదంపై జగన్, మీకు చేతకాకుంటే మేమొచ్చాం: ఊగిపోయిన వైసిపి నేత, తొలుత స్పందించింది వారే
గ్యారంటీ ఇవ్వగలరా
అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటి ప్రమాదాలు జరగవని గ్యారంటీ ఉందా అని సోము వీర్రాజు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. నీటు ఆటుపోటును బట్టి ప్రమాదాలు జరుగుతాయని ఆయన తేల్చి చెప్పారు. ఓవర్ లోడ్ చెక్ చేసేలా పర్యాటక శాఖకు అనుమతి ఇవ్వాలన్నారు. ఓవర్ లోడ్ను నియంత్రించాలన్నారు.
ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది ఉంటే
ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది ఉంటే లైఫ్ బోట్స్ కోసం ప్రయాణీకుల నుంచే డబ్బులు వసూలు చేయాలని సోము వీర్రాజు.. చంద్రబాబు ప్రభుత్వానికి సూచన చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, పడవ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 21కు చేరుకుంది.
పర్యాటక శాఖ అధికారుల అండగండలున్నాయని దూళిపాళ్ల
పడవ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బోట్లు నడుపుతున్నారంటే పర్యాటక శాఖ అధికారుల అండదండలు కచ్చితంగా ఉన్నట్లేనని ఈ టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. ఫెర్రీ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.
విశాఖలో టూరిజం బోటులో లైఫ్ జాకెట్లు ఇవ్వడం లేదు
ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, ఏ చట్టం తేవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. విశాఖలో టూరిజం బోటులో లైఫ్ జాకెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖలో బోట్లకు అనుమతులు ఇచ్చే అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రమాదాన్ని గుణపాఠంగా తీసుకోవాలన్నారు.
మంత్రులు వెంటనే వెళ్లారు
పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు కూడా అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పవిత్ర సంగమానికి వచ్చిన పర్యాటకులు అక్కడే మృతి చెందడం బాధాకరమన్నారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారని, మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాస్, అఖిలప్రియ హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారన్నారు.
వాళ్లు నదిలోకి తీసుకెళ్లారు
బోటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, ముగ్గురు బోటు సిబ్బంది ఆచూకీ తెలియడం లేదని, వాహనాలకు మాదిరిగానే బోట్లనూ నియంత్రించే విధంగా ఓ అథారిటీని ఏర్పాటు చేయనున్నామని, ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులు లేవని, ఆదివారం సాయంత్రం పర్యాటకులు వచ్చి పర్యాటక శాఖ బోటును ఎక్కితే సమయం మించిపోయిందని వారు ఒప్పుకోలేదని, దీంతో ప్రయివేటు బోటు సిబ్బంది వారిని ఎక్కించుకుని నదిలోకి తీసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగిందని చంద్రబాబు చెప్పారు.
బాధ్యత వారిదే
పవిత్ర సంగమం సమీపంలో బోటు కుదుపులకు లోను కావడంతో డ్రైవర్ ఒక్కసారిగా పక్కకు తిప్పాడని, దీంతో పర్యాటకులంతా ఓ వైపుకు వచ్చారని, భారం పెరిగి బోటు బోల్తా పడిందని, బోటు ప్రయాణించిన తీరు చూస్తుంటే డ్రైవర్కు ఆ మార్గంపై సరైన అవగాహన లేనట్లుగా తెలుస్తోందని, ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని, ఇది తప్పకుండా బోటు నిర్వాహకుల బాధ్యతా రాహిత్యమేనని చెప్పారు. బోటు నిర్వహాకులది బాధ్యత అని చంద్రబాబు అంటే టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల మాత్రం అధికారులది బాధ్యత అని చెప్పడం గమనార్హం.