జగన్ పర్మినెంట్ యూటర్న్?: అనాలోచితంగా తీసుకున్న ఆ నిర్ణయం వెనక్కి?: క్రెడిట్ టీడీపీదేనా?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఆవేశపూరితంగా గానీ.. అనాలోచితంగా గానీ ఆయన గత ఏడాది ఆ నిర్ణయం.. రాజకీయంగా దుమారం రేపింది. అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. న్యాయస్థానాల గడప తొక్కింది. రాజ్భవన్ తలుపులూ తట్టింది. కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. ఇప్పుడది దాదాపు అమల్లోకి రాకపోవచ్చు. వైఎస్ జగన్..దాన్ని వెనక్కి తీసుకున్నట్టే తెలుస్తోంది. దాన్ని అమలు చేయడంపై ఇప్పటిదాకా చేపట్టిన చర్యలను ఉపసంహరించుకోవచ్చని అంటున్నారు.
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కుమార్తె పేరు ఇదే: వైఎస్ కుటుంబంపై అలా అభిమానం
శాసన మండలిలో ఇక వైసీపీ హవా..
అదే- శాసన మండలి రద్దు వ్యవహారం. ఒక ఉప ముఖ్యమంత్రి, మరో మంత్రి రాజీనామాకు దారి తీసిన శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వైఎస్ జగన్ ఉపసంహరించుకోవడానికే అవకాశాలు ఉన్నాయి. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం భారీగా పెరగబోతోండటమే దీనికి కారణం. వచ్చే నాలుగు నెలల కాలంలో 24 మంది వైసీపీ సభ్యులు శాసన మండలిలో అడుగు పెట్టబోతోన్నారు. ఇక మున్ముందు ఖాళీ అయ్యే స్థానాలన్నీ దాదాపుగా వైసీపీ ఖాతాలోకే చేరడం ఖాయంగా కనిపిస్తోంది. శాసన మండలిపై పట్టు పెరగబోతోన్నందున దాన్ని రద్దుపై వైఎస్ జగన్ యూటర్న్ తీసుకుంటారనే అంటున్నారు.
ప్రస్తుతం ఆరు స్థానాలు..
శాసన మండలిలో ప్రస్తుతానికి ఆరు స్థానాలు ఖాళీ కాబోతోన్న విషయం తెలిసిందే. వాటిని భర్తీ చేయడానికి తన అభ్యర్థులను కూడా వైసీపీ ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన సీ రామచంద్రయ్య, అనంతపురానికి చెందిన మహ్మద్ ఇక్బాల్, శ్రీకాకళం జిల్లా నేత దువ్వాడ శ్రీనివాస్, కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నాయకురాలు కరిమున్నీసా, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి చల్లా భగీరథ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. పదవిలో ఉండగా మరణించిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్థానాన్ని ఆయన కుమారుడు భగీరథ రెడ్డితో భర్తీ చేయనున్నారు. గత ఏడాది కరోనా వల్ల కన్నుమూసిన తిరుపతి లోక్సభ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తిని మండలికి పంపించనున్నారు.
జూన్ నాటికి 18 స్థానాలు ఖాళీ..
ఈ ఖాళీల పరంపరం కొనసాగబోతోంది. వచ్చే జూన్ నాటికి మరో 18 శాసన మండలి స్థానాలు ఖాళీ కాబోతోన్నాయి. అవన్నీ అధికార పార్టీకే దక్కడం దాదాపుగా ఖాయమైనట్టే. మే 24వ తేదీ నాటికి మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. ఈ మూడూ వైసీపీకే దక్కుతాయి. జూన్ 11వ తేదీ నాటికి మరో నాలుగు ఖాళీలు ఏర్పడతాయి. ఈ నాలుగు కూడా గవర్నర్ కోటాలోనివి. ఈ నాలుగింటినీ భర్తీ చేయడానికి వైసీపీ తాను ఎన్నుకున్న ప్రముఖులనే మండలికి పంపిస్తుంది. గవర్నర్ కోటా అయినందున ఒకరిద్దరిని రాజకీయేతర రంగాలకు చెందిన వారిని ఎంపిక చేయడానికి అవకాశం ఉంది.
అదే నెలలో మరో 11..
అదే నెల 18వ తేదీ నాటికి మరో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. అవి స్థానిక సంస్థల కోటాకు చెందినవి. పంచాయతీ ఎన్నికల్లో నెలకొన్న ఊపు, ఫలితాలను వైసీపీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పోలింగ్లోనూ కొనసాగించగలిగితే.. ఈ 11 కూడా అధికార పార్టీకే చెందుతాయి. ఇప్పుడు కొత్తగా జారీ చేసిన నోటిఫికేషన్ను కూడా కలుపుకొని చూసుకుంటే.. వచ్చే నాలుగు నెలల కాలంలో 24 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. అవన్నీ తమ ఖాతాలోనే పడతాయని వైసీపీ నేతలు చెబుతోన్నారు.
రాజకీయ నేతలకు కొత్త ఊపిరి..
ఈ పరిణామాల మధ్య కౌన్సిల్లో ప్రవేశపెట్టే బిల్లులను ఆమోదింపజేసుకోవడం సులభతరమౌతుందని, అందుకే- మండలి రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవచ్చని అంటున్నారు. దీనితోపాటు- పార్టీకి చెందిన సీనియర్ నేతలకు కొత్తగా రాజకీయ జీవితాన్ని ప్రసాదించినట్టవుతుందని, వారికి కొత్త ఊపిరిని పోసినట్టవుతుందని వ్యాఖ్యానిస్తోన్నారు. శాసన సభ ఎన్నికల్లో టికెట్లు దక్కని నాయకులు, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి శాసన మండలికి పంపించడానికీ ఇది ఉపయోగపడుతుందని చెబుతోన్నారు.