రైల్వేమంత్రికి లేఖ రాసిన వైఎస్ జగన్: పేదల కోసం కీలక ప్రతిపాదన: 30 ఏళ్ల నాటి సమస్య
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్కు లేఖ రాశారు. ఓ కీలక ప్రతిపాదనను ఆయన ముందుంచారు. దీనికి ఆయన అంగీకరిస్తే.. విజయవాడలో నివసిస్తోన్న కొన్ని పేద కుటుంబాలకు లబ్ది కలుగుతుంది. వారు ఇప్పుడు నివసించే ప్రదేశంలోనే శాశ్వతంగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. వైఎస్ జగన్ చేసిన ఈ ప్రతిపాదనకు రైల్వేమంత్రి గానీ, ఆ మంత్రిత్వ శాఖ అధికారులు గానీ ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది. వారి స్పందన మీదే ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదన ఆధారపడి ఉంది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి పేటకు సంబంధించిన అంశం ఇది. రాజరాజేశ్వరి పేటలో 800 కుటుంబాలు రైల్వేకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకున్నాయి. అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 30 ఏళ్లుగా నివసిస్తోన్నాయి. తమ స్థలాలను క్రమబద్దీకరించాలంటూ ఇదివరకు ఆ కుటుంబాల వారు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఙప్తి చేశారు. వినతిపత్రాలను అందజేశారు. అవేవీ ఫలించలేదు. రైల్వేకు సంబంధించిన స్థలం కావడం వల్ల.. దాన్ని క్రమబద్దీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.
దీన్ని పరిష్కరించడానికి వైఎస్ జగన్ చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం రాజరాజేశ్వరి పేటలో పేదలు అక్రమంగా నివాసాలను ఏర్పాటు చేసుకున్న స్థలానికి బదులుగా.. ప్రభుత్వ స్థలాన్ని రైల్వేశాఖకు కేటాయిస్తామని ఆయన ప్రతిపాదించారు. ఎంత స్థలం ఆక్రమణకు గురైందో.. అంత మేర స్థలాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే రైల్వేకు ఇస్తామని అన్నారు. ప్రస్తుతం 800 పేద కుటుంబాలు నివసిస్తోన్న స్థలాన్ని తమకు అప్పగించితే.. దాన్ని క్రమబద్దీకరించుకుంటామని చెప్పారు.
స్థలానికి బదులుగా స్థలాన్ని ఇచ్చినట్టవుతుందని చెప్పారు. 30 ఏళ్లుగా రాజరాజేశ్వరి పేటలో ఆక్రమణకు గురైన ఆ స్థలాన్ని రైల్వే అధికారులు వినియోగించుకోవట్లేదని, అలా నిరుపయోగంగా ఉంచడం కంటే.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడం వల్ల క్రమబద్దీకరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే- ఆ స్థలానికి బదులుగా తాము కొత్తగా కేటాయించే స్థలాన్ని వినియోగంలోకి తీసుకుని రావడం వల్ల రైల్వేకు అదనపు ఆదాయం వస్తుందని జగన్ సూచించారు. అజిత్ సింగ్ నగర్లో రైల్వేకు చెందిన 25 ఎకరాల స్థలం ఉందని, దానికి కొనసాగింపుగా కొత్తగా భూమిని కేటాయిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.