ప్రత్యేక హోదాపై పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు- ఎమ్మెల్సీగా రాజీనామా- చిరకాల కోరిక నెరవేరిందంటూ..
ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇవాళ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి కార్యదర్శి వద్దకు వచ్చి తన రాజీనామాను సమర్పించారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నందున అంతకు ముందే మండలి నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటున్నట్లు పిల్లి తెలిపారు. ఈ సందర్బంగా రాజ్యసభకు ఎంపిక, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు కీలక అంశాలపై బోస్ నిర్మొహమాటంగా పలు వ్యాఖ్యలు చేశారు.
ఏడాది కాలంలో డిప్యూటీ సీఎంగా ఎంతో సంతృప్తిగా పనిచేసినట్లు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ సందర్బంగా తెలిపారు. తన శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఏ రోజూ జోక్యం చేసుకోకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. అంతే కాకుండా మండలి రద్దయ్యే వరకూ డిప్యూటీ సీఎంగా కొనసాగినా అభ్యంతరం లేదని జగన్ చెప్పినట్లు పిల్లి వెల్లడించారు. పార్లమెంటుకు వెళ్లాలనేది తన చిరకాల కోరిక అని, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పిల్లి పేర్కొన్నారు.
ప్రత్యేక హోదాపైనా పిల్లి సుభాష్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని, కానీ ప్రస్తుత పరిస్దితుల్లో ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని పిల్లి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై తనకు నమ్మకం లేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. పార్టీని ధిక్కరిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై స్పందిస్తూ పార్టీ తరఫున గెలిచిన ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించాల్సిందేన్నారు.