coronavirus:గుజరాత్లో సిక్కోలు మత్య్సకారుడి మృతి, మురికికాల్వ వద్ద ఉంచడంతోనే..?
గుజరాత్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన మత్స్యకారుడు కామరామ్ మృతిచెందాడు. అతను అనారోగ్యంతో చనిపోయాడని తెలుస్తోంది. అయితే గుజరాత్ వీరవడ్లో ఉన్న తమకు కనీస వసతులు కల్పించడం లేదు అని వారు ఆరోపిస్తున్నారు. నెలరోజులు గడుస్తోన్నా తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు మత్య్సకారులు ఇప్పటికే చనిపోగా..కామరాజ్తో ఆ సంఖ్య మూడుకి చేరింది. వీరవడ్లో ఉన్న మిగతా మత్య్సకారుల్లో ఆందోళన నెలకొంది.
5 వేల మంది..
నెలక్రితం మత్య్సకారులు గుజరాత్లో చిక్కుకున్నారు. లాక్ డౌన్ అమలు కావడంతో వారు అక్కడే ఉన్నారు. ఏపీకి చెందిన 5 వేల మంది మత్స్యకారులు అక్కడే ఉన్నారు. ఇందులో 2 వేలకు పైగా మత్య్సకారులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు ఉన్నారు. తమకు సరైన వసతి కల్పించడం లేదు అని.. తాగడానికి మంచినీళ్లు లేవు అని.. తినడానికి సరైన తిండి కూడా లేదని పేర్కొన్నారు. తమను మురికి కాల్వ వద్ద ఉంచారని తమ గోడును వెల్లబోసుకున్నారు. తమను స్వగ్రామాలకు తీసుకురావాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ, నేతలు, అధికారులను కోరారు.
వీడియో పోస్ట్.. పవన్ కల్యాణ్ చొరవ..
తమ సమస్యలపై ఇటీవల మత్య్సకారులు వీడియో తీసి కూడా పోస్ట్ చేశారు. గుజరాత్ నుంచి ఏపీకి ఒక రైలు వేయాలని అందులో కోరారు. దీంతో తామంతా స్వస్థలాలకు చేరుకుంటామని పేర్కొన్నారు. దీనిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వారిని రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. లేదంటే గుజరాత్లో సరైన వసతులు కల్పించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. పవన్ కల్యాణ్ సూచనతో సీఎం జగన్ స్పందించారు.
సీఎంకు జగన్ ఫోన్
గుజరాత్లో చిక్కుకున్న మత్య్సకారులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ రుపానీకి ఆదివారం సీఎం జగన్ ఫోన్ చేసి కోరారు. సీఎం జగన్ విజ్ఞప్తికి విజయ్ రుపానీ కూడా సానుకూలంగా స్పందించారు. మత్స్యకారులకు తగిన వసతి, ఆహారం అందిస్తామని పేర్కొన్నారు. కానీ ఫోన్ చేసి కోరినా రెండురోజులకే మత్య్సకారుడు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనినిబట్టి అక్కడ మత్య్యకారులకు సరైన వసతి, ఆహారం అందించడం లేదని అర్థమవుతోంది.